Kishan Reddy To Launch Secunderabad To Goa Spl Train: సికింద్రాబాద్- వాస్కోడగామా- సికింద్రాబాద్ రైలును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని భోయి గూడా వైపు గల పదో నంబర్ ప్లాట్ ఫారంపై నుంచి గోవా రైలు సర్వీస్ను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు ప్రతీ బుధవారం, శుక్రవారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. అలాగే ప్రతీ గురువారం, శనివారం వాస్కోడిగామా నుంచి బయలుదేరనుంది. ఈ రైలు కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్డెమ్, మడగావ్ జంక్షన్ల తదితర స్టేషన్లలో ఆగనుంది.
ఈ రైలు తీసుకురావడంతో తెలంగాణ రాజధానితో గోవా రాజధాని వాస్కోడగామాతో మెరుగైన అనుసంధానం జరగనుంది. ఈ రైలు వారానికి రెండు రోజులు ఇరు మార్గాలలో నడవనుంది. కాగా, ప్రస్తుతం కర్నాటక, గోవా ప్రాంతాలకు వెళ్లేందుకు తెలుగు ప్రజలకు ప్రయాణ సౌలభ్యాలు తక్కువగా ఉన్నందున గోవా చేరుకోవడానికి గుంతకల్లు వద్ద ఉన్న ఇతర రైళ్లకు అనుసంధానించవలసిన లింక్ రైళ్లు మాత్రమే నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఈ రైలు తీసుకురావడంతో అనుకూలమైన సమయాలతో సికింద్రాబాద్ నుంచి ప్రత్యేకమైన రైలు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ కొత్త రైలు దాదాపు 854 కి.మీల దూరాన్ని దాదాపు 20 గంటలపాటు ఎగువ దిశలో, 21 గంటల పాటు దిగువ దిశలో ప్రయాణం పూర్తిచేయనుందని అధికారులు తెలిపారు.
Also Read: రెసిడెన్షియల్ స్కూళ్లకు భట్టి విక్రమార్క గుడ్న్యూస్
ఈ రైలు మార్గంలో ప్రత్యేకమైన చారిత్రక, పర్యాటక ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఇతర ముఖ్యమైన నగరాలను కలుపుతూ, నూతన ప్రాంతాలనుంచి పెరిగిన ప్రయాణికులతో నిర్దిష్ట బంధాన్ని ఏర్పరుచుకోవడానికి అవకాశం కల్పించనుంది. ఇక, ఈ రైలు అత్యాధునిక ఎల్హెచ్బీ కోచ్లతో ప్రవేశపెట్టగా.. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతితో పాటు ఆధునిక సౌకర్యాలను అందించేందుకు తీసుకొచ్చినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.