Yarn Depot to be Etablished: దసరా పండుగ వేళ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జిల్లాకు నూలు డిపోను మంజూరు చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం శనివారం వెల్లడించింది. దీంతో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న నేతన్నల కోరిక నెరవేరింది. ఇక వారి కష్టాలు తీరనున్నాయి. ఈ విషయం తెలిసి నేతన్నలు రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు యారన్ డిపోను మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యారన్ డిపోను వేములవాడలో ఏర్పాటు చేయనున్నారు. దీంతో దాదాపు 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మరమగ్గాల కార్మికుల కల నెరవేరింది. యారన్ డిపోను ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దాదాపు 40 వేల మరమగ్గాలపై పనిచేస్తున్న 30 వేల మంది నేతన్నలకు లబ్ధి చేకూరనున్నది.
Also Read: మా ప్రభుత్వానికి ఎవరిమీద కోపం లేదు.. కానీ,… : సీఎం రేవంత్ రెడ్డి
ప్రధానంగా వేములవాడ కేంద్రంగా యారన్ డిపోను ఏర్పాటు చేయడం వలన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలలోని సుమారు 30 వేల మరమగ్గాల కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరనున్నది. యారన్ డిపో ఏర్పాటు చేయడం వలన మరమగ్గాల పరిశ్రమలోని నేతన్నలకు పెట్టుబడిదారులపై ఆధారపడకుండా నేరుగా వారి ఉపాధి లభిస్తుంది.
కాగా, యారన్ డిపోను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ యారన్ డిపో టెస్కో ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. మరమగ్గాల కార్మికులకు అవసరమగు నూలును టెస్కో క్రెడిట్ పద్ధతిలో సరఫరా చేసి వస్త్రాన్ని కొనుగోలు చేయనున్నది. యారన్ డిపోను ఏర్పాటు చేయడంతో సిరిసిల్ల నేతన్నలతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: దసరా పండుగ వేళ తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త… త్వరలోనే..
వేములవాడ కేంద్రంగా యారన్ డిపోను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.