Posani.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) తన అద్భుతమైన నటనతో ఎంతోమంది ఆడియన్స్ ను తన అభిమానులుగా మార్చుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కమెడియన్ గా , విలన్ గా నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈయన రాజకీయాలలో కూడా చురుగ్గా పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా పదవి నుండి తప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇకపోతే గతంలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ భారీ కామెంట్లు చేసిన పోసాని , తాజాగా నాగార్జున (Nagarjuna) ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతేకాదు నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చడం కరెక్టే అంటూ కామెంట్లు చేశారు.
నాగార్జున అక్రమంగా నిర్మించాడు – పోసాని..
తాజాగా బిగ్ టీవీ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న పోసాని కృష్ణ మురళి హైడ్రాపై పలు ఆసక్తికర కామెంట్లు చేస్తూనే.. అక్కినేని నాగార్జునపై ఊహించని కామెంట్లు చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ.. నేను హైదరాబాదులో పలు స్థలాలు చట్టబద్ధంగా కొన్నాను. గత 40 సంవత్సరాలుగా నాకు ఎటువంటి సమస్యలు లేవు. అయితే నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ చెరువు పరిధిలోనే ఉంది కాబట్టి దానిని కూల్చడం కరెక్టే. అక్రమంగా నిర్మించిన దానికి చట్టబద్ధత కల్పించాలని, నేను వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని అడిగితే.. నీకు బుద్ధి లేదా అంటాడు. ఎవరైనా పైరవీలకు అలవాటు పడితేనే ఇలాంటి సమస్యలు వస్తాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇకపోతే నాగార్జునను పరోక్షంగా మోసాలకు పాల్పడుతున్నాడు అంటూ కృష్ణ మురళి చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
నాగార్జున ఎన్ – కన్వెన్షన్ కూల్చివేత..
ఇదిలా ఉండగా హైదరాబాదు నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక నిర్మాణాలు అక్రమంగా నిర్మించారని గ్రహించిన అధికారులు వాటిని కూల్చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఆగస్టు నెలలో అక్రమ నిర్మాణాలకు కూల్చివేతలో భాగంగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందగా.. తుమ్మకుంట చెరువును ఆక్రమించి, నాగార్జున మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించాలని పలువురు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇక ఆ చెరువు ఎఫ్ టి ఎల్ పరిధిలో కన్వెన్షన్ నిర్మించారని గతంలో కూడా ఫిర్యాదులు అందాయి. అయితే ఎవరు అప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు హైడ్రా అధికారులు సర్వే నిర్వహించి , పక్కా ఆధారాలతోనే శనివారం తెల్లవారుజామున కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేశారు. అయితే దీనిపై మండిపడ్డ నాగార్జున కోర్టును ఆశ్రయించి.. కూల్చివేత ఆపాలని కోర్టు స్టే ఇచ్చినప్పటికీ జరగాల్సినదంతా జరిగిపోయింది. ముఖ్యంగా నాగార్జున అక్రమంగా ఎన్ కన్వెన్షన్ కట్టారని అందులో కొంత భాగాన్ని కూల్చివేశారు. ఇక ఇప్పుడు ఆ కన్వెన్షన్ ను కూల్చి వేయడం కరెక్టే అంటూ పోసాని కృష్ణ మురళి కామెంట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.