– మూసీ మురుగు నుంచి పేదలకు విముక్తి
– వారందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తాం
– మూసీపై కేటీఆర్ అతితెలివి ప్రశ్నలు
– రుణమాఫీపై హరీష్ అసత్యాల ప్రచారం
– ఆయన రాజీనామా సవాలు ఎటు పోయింది?
– ఇందూరుకు త్వరలోనే అమాత్యయోగం
– బోధన్ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించే పూచీ మాదే
– పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్, స్వేచ్ఛ: పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ పర్యటన కొనసాగుతోంది. శనివారం డిచ్పల్లి సీఎస్ఐ ఆసుపత్రిలో డాక్టర్స్ క్వార్టర్స్ ప్రారంభించారు. అనంతరం ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. సీఎస్ఐ ఆధ్వర్యంలో త్వరలోనే నర్సింగ్ కళాశాల ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి డిచ్పల్లిలో మెడికల్ కాలేజీని పున:ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
మూసీ ప్రక్షాళన తథ్యం..
ఒకప్పుడు జీవనదిగా ఉన్న మూసీ కాలుష్య కాసారంగా మారిందని, అందుకే దాని ప్రక్షాళనకు తాము పూనుకున్నామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. వేలాది పేదలు మూసీ మురుగులో జీవిస్తున్నారని, వారిని అక్కడి నుంచి తరలించి ఇండ్లు అందిస్తామని క్లారిటీ ఇచ్చారు. విపక్షాలు దీనిని రాజకీయ సమస్యగా గాక సామాజిక సమస్యగా చూడాలని కోరారు. హైడ్రా మహాయజ్ఞమని అది ఆగదని స్పష్టం చేశారు. హైడ్రాను ఆపితే హైదారాబాద్ మరో వయనాడ్ అవుతుందని, త్వరలోనే హైడ్రాను జిల్లాలకు విస్తరిస్తామని, ప్రభుత్వ స్థలాలు అక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని, తన కుటుంబసభ్యులు కబ్జా చేసినా ఉపేక్షించాల్సిన పనిలేదని ప్రకటించారు. మూసీ పేరుతో ప్రభుత్వం నిధులు మళ్లిస్తోందన్న కేటీఆర్ ప్రశ్నకు జవాబిస్తూ.. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు డి.పి.అర్ ఇంకా సిద్ధం కాలేదని, అలాంటప్పుడు నిధులు ఎలా మళ్లిస్తామో వారే చెప్పాలన్నారు.ఆయన ప్రశ్నలు చూస్తుంటే కేటిఆర్ అమెరికాలో నిజంగా చదివాడా లేక డబ్బులిచ్చి సర్టిఫికెట్ కొన్నాడోనని అనుమానం వస్తోందన్నారు.
హరీష్.. అబద్ధాలొద్దు
రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం వచ్చిన 3 విడతలలో రైతు రుణమాఫీ చేపట్టిందని పీసీసీ అధ్యక్షుడు వివరించారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీలో ఇబ్బందులున్న కారణం చూపి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు అసలు రుణమాఫీయే జరగనట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఎంత రుణమాఫీ జరిగిందో హరీష్ చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్నాల పేరిట హరీష్ రావు ప్రజలను మభ్యపెట్టటానికి బదులు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని చేసిన సవాలు సంగతి ఏమైందో చెప్పాలని ఎద్దేవా చేశారు.
ఇందూరుకు గుర్తింపు..
నిజామాబాద్ జిల్లాకు పూర్వ వైభవం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు.త్వరలోనే బోధన్ షుగర్ ఫ్యాక్టరీని కూడా పునరుద్ధరిస్తామని అన్నారు. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ పదవులపై ప్రకటన చేస్తామని, రాబోయే మంత్రి వర్గ విస్తరణలో నిజామాబాద్కు చోటు దక్కనుందని ఆయన హామీ ఇచ్చారు.