Durga Puja Menu For Bengal Prisoners: భారత్ లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో దసరా ఒకటి. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసే భక్తలు దసరా రోజు కుటుంబ సభ్యులతో హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేస్తారు. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్షణికావేశాల్లో తప్పు చేసి జైల్లో ఉన్న ఖైదీల విషయంలో మానవతా దృక్పథంతో మంచి నిర్ణయం తీసుకుంది. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు దసరా సందర్భంగా స్పెషల్ మెనూను అందుబాటులోకి తీసుకురాబోతోంది. బెంగాల్ లోని అన్ని జైల్లలో ఈ మెనూను ఇంప్లిమెంట్ చేయనుంది. మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ లాంటి వంటకాలతో పసందైన విందును అందించబోతోంది.
దసరా స్పెషల్ మెనూలో వంటకాలు ఇవే..
బెంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మెనూ అక్టోబర్ 9 నుంచి 12 వరకు అందుబాటులో ఉంటుంది. కొత్త మెనూ ప్రకారం నాలుగు రోజుల పాటు లంచ్, డిన్నర్ సమయంలో నాన్ వెజ్ ఫుడ్ అందించనున్నారు. రైతాతో మటన్ బిర్యానీ, బసంతి పులావ్, చేప తలతో మలబార్ బచ్చలికూర, చేప తలతో చేసిన పప్పు, పూరీ, బెంగాలీ చనా పప్పు, చికెన్ కర్రీ, పొట్లకాయ, బంగాళాదుంప రొయ్యల కూరను అందించనున్నారు. ఖైదీలు పండుగ సంతోషాన్ని కోల్పోతున్నామనే బాధ కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఫుడ్ జైలు ఖైదీల చేత తయారు చేయించనున్నట్లు తెలిపారు. ఖైదీల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే కొత్తగా ఆలోచనలు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రిమాండ్ ఖైదీలకూ ఇదే మెనూ
దసరా సందర్భంగా ఖైదీల కోసం తీసుకొస్తున్న మెనూను రిమాండ్ ఖైదీలకు అందిస్తామని అధికారులు తెలిపారు. దుర్గా పూజ ప్రారంభం నుంచి ముగింపు వరకు చక్కటి ఆహారారాన్ని పెట్టబోతున్నట్లు వెల్లడించారు. ప్రతి ఏటా దసరా సందర్భంగా ఖైదీల కోసం మంచి ఆహారం అందిస్తున్నామని, అయితే, ఈసారి ప్రభుత్వం కొత్త మెనూను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఖైదీల విజ్ఞప్తి మేరకు బెంగాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి పద్దతులతో ఖైదీల్లో మార్పు వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.
59 జైళ్లలో 29 వేల మంది ఖైదీలు
బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 59 జైళ్లు ఉన్నాయి. అన్ని జైళ్లలో కలిపి సుమారు 29 వేల మంది ఖైదీలు ఉన్నారు. వారిలో పురుషులు 26,994 మంది ఉండగా, స్త్రీలు 1,778 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో చాలా మంది క్షణికావేశంలో నేరాలు చేసిన వాళ్లే ఉన్నారని అధికారులు తెలిపారు. వారిలో మార్పు తీసుకొచ్చి మంచివారిగా మార్చాలని చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పలువురు మోటివేషినల్ స్పీకర్స్ ను తీసుకొచ్చి వారికి ప్రత్యేక సెషన్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మంచి ఉపన్యాసాలతో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే దసరా సందర్భంగా స్పెషల్ ఫుడ్ మెనూ అమలు చేస్తున్నట్లు తెలిపారు.
Read Also:ట్రైన్ ఫర్ సేల్.. సీరియస్ బయ్యర్స్ మాత్రమే ట్రై చేయండి- సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో!