Rain Alert: రెండు తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ కేంద్రం (IMD) భారీ వర్షసూచన ఉన్నట్లు ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ మరో అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
నైరుతి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్కు చేరువగా బంగాళాఖాతంలో ఏర్పడినట్లు భారత వాతావరణ కేంద్రం ప్రకటన జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని, అది కూడా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అందుకే రాయలసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసి అధికారులను అప్రమత్తం చేసింది.
అలాగే ఏపీ ప్రకృతి విపత్తుల సంస్థ కూడా మరో ప్రకటన జారీ చేసింది. ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ,అనకాపల్లి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా రాయలసీమ ప్రాంతంలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది.
అలాగే అల్పపీడనం కారణంగా తెలంగాణకు భారీ వర్షసూచన ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ (TELANGANA) లోని పలు జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ ప్రకటనతో తెలంగాణ ప్రభుత్వం.. వర్షాలు కురిసే అవకాశం ఉన్న అన్ని జిల్లాల అధికారులకు అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read: TTD: తిరుమల వెళుతున్నారా.. ఇక అసలు అస్త్రం మీ చేతిలోనే.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
అయితే ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు తగిన జాగ్రత్త వహించాలని, అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. పిడుగులు పడే సమయంలో బయటి ప్రాంతాలలో ఉండరాదని, నివాస గృహాలలో ఉండడమే ఉత్తమమని సూచించారు. అలాగే రైతులు వ్యవసాయ మోటార్ల వద్దకు వర్షం సమయంలో వెళ్లరాదని, గృహ విద్యుత్ వినియోగదారులు కూడా ఏవైనా విద్యుత్ తీగలు వ్రేలాడుతున్న యెడల విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు. 4 రోజులు రెండు రాష్ట్రాలకు భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో తస్మాత్ జాగ్రత్త సుమా !