Panasa Curry: కోనసీమ ప్రాంతాల్లో పనస కూరకు ఎంతో డిమాండ్ ఉంటుంది. అక్కడ జరిగే వేడుకల్లో పనస కూర కచ్చితంగా ఉండాల్సిందే. దీని రుచి కూడా అంతా అద్భుతంగా ఉంటుంది. కాబట్టే ఆహార ప్రియులకు ఇది బాగా నచ్చుతుంది. ఇక్కడ మేము ఆవపెట్టిన పనస కూర రెసిపీ ఇచ్చాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి మీకు నచ్చడం ఖాయం.
ఆవ పెట్టి పనసపొట్టు కర్రీకి కావాల్సిన పదార్థాలు
పనసపొట్టు – పావు కిలో
పచ్చిమిర్చి – ఏడు
అల్లం – చిన్నముక్క
చింతపండు – నిమ్మకాయ సైజులో
మెంతులు – పావు స్పూను
మినప్పప్పు – ఒక స్పూను
శనగపప్పు – ఒక స్పూన్
ఆవాలు – అర స్పూను
జీలకర్ర – ఒక స్పూను
కరివేపాకులు – గుప్పెడు
నూనె – సరిపడినంత
పసుపు – పావు స్పూను
కారం – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
ఎండుమిర్చి – మూడు
ఆవపెట్టిన పనసపొట్టు కూర రెసిపీ
1. పనసపొట్టును సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
2. దాన్ని శుభ్రంగా కడిగి నీటిలో వేసి కాసేపు ఉడికించండి.
3. తర్వాత ఆ నీటిని వంపేసి పనసపొట్టును పక్కన పెట్టుకోండి.
4. చింతపండును నీటిలో వేసి నానబెట్టుకోండి.
5. అలాగే అల్లం, పచ్చిమిర్చి, మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి.
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.
7. ఆ నూనెలో మెంతులు, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించండి.
8. ఆవాలు, జీలకర్ర కూడా వేసి వేయించండి.
9. తర్వాత కరివేపాకులు రుబ్బిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోండి.
10. పసుపు, కారం వేసి బాగా కలపండి.
11. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న పనసపొట్టును అందులో వేసి బాగా కలపాలి.
12. దీన్ని మూత పెట్టి పావుగంట సేపు ఉడికించాలి.
13. ఆ తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసి బాగా కలుపుకొని స్టవ్ మీద ఉంచుకోవాలి.
14. ఇప్పుడు ఆవ పొడిని రెడీ చేసుకోవాలి.
15. దీనికోసం ఒక స్పూను ఆవాలు, నాలుగు ఎండు మిర్చి కలిపి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇదే ఆవ పొడి.
16. ఉడుకుతున్న పనసపొట్టు కూరలో ఈ ఆవ పొడిని కూడా వేసి బాగా కలుపుకోండి.
17. అది దగ్గరగా అయ్యేవరకు చిన్న మంట మీద ఉడికించండి.
18. తర్వాత కొత్తిమీర తరుగును చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి.
19. అంతే టేస్టీ ఆవపెట్టిన పనసపొట్టుకూర రెడీ అయినట్టే.
20. దీన్ని తెల్లన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
21. రోటి చపాతీతో కూడా తినవచ్చు. ఒక్కసారి దీన్ని తిని చూడండి. ఆవపొడి వేయడం వల్ల దీనికి ప్రత్యేకమైన రుచిని వస్తుంది.
పనసపొట్టులో మన ఆరోగ్యానికి అవసరమైన మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం, నియాసిన్, ఫైబర్ వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి. పనసపొట్టును తినడం వల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ఆరోగ్య నిపుణులు అప్పుడప్పుడు పనసపొట్టును తినమని చెబుతూ ఉంటారు. మహిళలు పసపొట్టు చేసిన కూరను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఊబకాయం బారిన పడకుండా కాపాడుతుంది. పనసపొట్టులో పొటాషియం కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి రక్తపోటును తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. పనసకాయను శాఖాహార మాంసంగా చెప్పుకుంటారు. శాకాహారులు దీన్ని చాలా ఇష్టంగా తింటారు.
Share