Haryana assembly election: హర్యానా శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బీజేపీ ఎంపీ, ప్రముఖ వ్యాపారవేత్త నవీన్ జిందాల్ వెరైటీగా గుర్రం మీద పోలింగ్ స్టేషన్ కు వచ్చారు. కురుక్షేత్రంలోని సెంటర్ కు చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టబోతుందని జోస్యం చెప్పారు. మరోసారి నయాబ్ సింగ్ సైనీ ముఖ్యంత్రి పగ్గాలు చేపడుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
“శుభపరిణామంగా భావించి గుర్రంపై స్వారీ చేస్తూ పోలింగ్ స్టేషన్ కు వచ్చాను. బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ప్రజలంతా ఓటు వేయాలి. మా అమ్మ సావిత్రి జిందాల్ హిసార్ నుంచి పోటీ చేస్తున్నది. హిసార్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఆమె భావిస్తున్నది. తమ ప్రతినిధిగా ఎవరు ఉండాలి అనేది హిసార్ ప్రజలు నిర్ణయిస్తారు. రాష్ట్ర ప్రజలు తమ పార్టీని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను. ప్రజలు చాలా ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. హర్యానా ప్రజలకు మంచి అవగాహన ఉన్నది. బీజేపీకి ఆశీస్సులు అందిస్తారని భావిస్తున్నాను. నయాబ్ సింగ్ సైనీ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే విశ్వాసం ఉంది” అని జిందాల్ వెల్లడించారు.
मैंने अपने लोकतांत्रिक अधिकार का प्रयोग करते हुए मतदान किया ताकि हमारा लोकतंत्र और मजबूत हो। आप सभी से आग्रह है कि जाएं, वोट दें और सही चुनाव करें। यह निश्चित है कि हरियाणा में भाजपा ही सरकार बनाएगी, इसलिए अपनी भागीदारी सुनिश्चित करें क्योंकि आपका प्रत्येक मत महत्वपूर्ण है। pic.twitter.com/6p1oqIWEr5
— Naveen Jindal (@MPNaveenJindal) October 5, 2024
ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జిందాల్ తల్లి
ఎంపీ నవీన్ జిందాల్ తల్లి, ఓపీ జిందాల్ గ్రూప్ చైర్ పర్సన్ అయిన సావిత్రి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హిసార్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్నారు. ఆమె హర్యానా మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే కమల్ గుప్తాపై పోటీ చేస్తున్నారు. తన ఓటు హక్కును వినియోగించుకున్నసావిత్రి.. హర్యానా ప్రజలంతా ఓట్లు వేయాలని రిక్వెస్ట్ చేశారు. “ఇది హిసార్ ప్రజల ఎన్నికలు. నేను ఓటు వేసాను. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. హిసార్ అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తాను’’ అని ఆమె వెల్లడించారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల గురించి..
90 మంది సభ్యుల హర్యానా శాసనసభకు 101 మంది మహిళలు సహా 1,031 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఒకే దశలో హర్యానా ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 2014 నుంచి బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్నది. కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గెలుపొందాలని ఆశిస్తోంది. అధికార పార్టీ మీద వ్యతిరేకత, రైతులు, రెజ్లర్ల నిరసనలు ప్రధాన అంశాలుగా మలుచుకుని ఎన్నికల బరిలోకి దిగింది.
ముఖ్య మంత్రి, బీజేపీ నాయకుడు నయాబ్ సింగ్ సైనీ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, మాజీ ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ఎన్నికల బరిలో నిలిచారు. గత నెలలో కాంగ్రెస్ పార్టీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ రెజ్లర్ వినేష్ ఫోగట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలచింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో, హర్యానాలోని 90 సీట్లలో 40 సీట్లను బీజేపీ గెలుచుకుంది, 10 సీట్లు గెలుచుకున్న JJPతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్కు 31 సీట్లు వచ్చాయి.
Read Also: సెక్రటేరియట్ మూడో అంతస్తు నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్.. ఎమ్మెల్యేలు, ఎందుకో తెలుసా?