Bathukamma Celebrations in Gandhi Bhavan: నాంపల్లిలోని గాంధీ భవన్ లో శనివారం మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు అధ్యక్షతన మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం వారు.. బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ సంబరాలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రారంభించారు. అనంతరం మహిళలకు ఆయన బతుకుమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంబరాల్లో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంప్రదాయ బద్ధంగా గౌరమ్మ పూజలు చేసి బతుకమ్మ ఆటలు ఆడారు. దీంతో గాంధీ భవన్ లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రవళి రెడ్డి, మహిళ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా ఈ సంబరాల్లో పాల్గొన్నారు.
Also Read: చార్మినార్ పైకి ఎక్కిన వ్యక్తి… స్టంట్స్ చేస్తున్నాడా..?
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు సద్దుల బతుకమ్మ వరకు కొనసాగనున్నాయి. ఈ తొమ్మిదిరోజులపాటు మహిళలు బతుకమ్మ పండుగను జరుపుకోనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయంలో భాగంగా దసరా పండుగకు ముందుగా ఈ బతుకమ్మ వేడుకలను జరుపుకుంటారు. ప్రకృతిలో దొరికే పువ్వులతో బతుకమ్మను పేర్చి, ఆ తరువాత అంతా ఒక చోట చేరి ఆ బతుకమ్మలను అక్కడి పెట్టి బతుకమ్మ ఆడుతారు. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ.. సంప్రదాయ పద్ధతిలో చప్పట్లు కొడుతూ.. పాటలు పాడుకుంటూ సంబరాలను నిర్వహిస్తుంటారు. అనంతరం ఆ బతుకమ్మలను నీటిలో వదులుతారు.
Also Read: రూ.1500 కోట్లు ఉన్నాయి కదా.. పేదలకు రూ.500 కోట్లు ఇవ్వండి.. బీఆర్ఎస్కు సీఎం సెటైర్
ఇలా మొత్తం తొమ్మిదిరోజులపాటు మహిళలు బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారు. ఒక్కోరోజు ఒక్కో బతుకమ్మను ఏర్పాటు చేస్తారు. ఒక్కో బతుకమ్మకు ఒక్కో ప్రత్యేకత ఉంది. తొమ్మిదవ రోజు బతుకమ్మ పండుగకు ముగింపు రోజు. ఆరోజు బతుకమ్మకు ఎన్నో విధాలైన చద్దులను వండి నివేదిస్తారు. ఆరోజు నిర్వహించే బతుకమ్మను విశేషమైన సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. చివరి రోజును బతుకమ్మ ఆడిన తరువాత ఆ బతుకమ్మలను ఊరేగింపుగా మంగళ వాయిద్యాలతో జలాశయాలకు తీసుకెళ్లి, అక్కడ నీళ్లలో బతుకమ్మలను నిమజ్జనం చేస్తుంటారు. ఆ తరువాతనే దసరా పండుగను నిర్వహిస్తారు. ఇలా మహిళలు ఆనందంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.
Also Read: నువ్వు ఢిల్లీ వెళ్లు… నేను మీ మామ ఫాం హౌస్ కు వెళ్తా.. హరీష్ రావుకు జగ్గారెడ్డి సవాల్
ఇటు ప్రభుత్వం కూడా సాంస్కృతి శాఖ ఆధ్వర్యంలో బతుక్మ సంబరాలను నిర్వహిస్తున్నది. ట్యాంక్ బండ్ పై పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలను నిర్వహించనున్నది. రాష్ట్రంలోని మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.