Cm Revanth Reddy: బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న నగదులో.. కొంత పేదలకు ఇవ్వొచ్చు కదా.. పేదల కోసం పాటుపడినట్లు ఉంటుంది అంటూ బీఆర్ఎస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి సలహా ఇచ్చారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో స్వర్గీయ వెంకటస్వామి (కాకా) జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. అయితే ఈ ప్రసంగంలో ప్రతిపక్షాన్ని ఎప్పుడూ ఇరకాటంలో పెట్టే సీఎం రేవంత్.. ఈ సారి సాఫ్ట్ కార్నర్ లో ప్రసంగించడం ప్రత్యేకతను సంతరించుకుంది.
ముందుగా కాకా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం రేవంత్ (Cm Revanth Reddy).. ఆయన పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం మూసీ ప్రక్షాళనపై సీఎం మాట్లాడుతూ.. మూసీ నిర్వాసితులకు అండగా ఉంటామని, బఫర్జోన్లో ఇళ్లు ఉన్నవాళ్లకు కూడా ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. ఫాంహౌస్లను కాపాడుకునేందుకే కొందరు పేదలను రెచ్చగొడుతున్నారని, ప్రత్యామ్నాయం అడిగితే చెప్పే స్థితిలో రెచ్చగొట్టేవారు లేరన్నారు.
చెరువుల ఆక్రమణలతో మన బతుకులు సర్వనాశనం అవుతాయని, గత ఎండాకాలం బెంగళూరులో నీళ్లు లేని పరిస్థితిని అందరూ చూశారు కదా అంటూ ప్రశ్నించారు. మూసీ నిర్వాసితులకు రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమని, చెరువులు, నాలాలు పోయి, చివరకు మూసీ కూడా పోతే నగరానికి వరద పోటెత్తితే వరదను భరించే దారి ఏదన్నారు.
హైదరాబాద్ పూర్తిగా కాంక్రీట్ జంగిల్ గా మారిందని, గ్రౌండ్ వాటర్ పూర్తిగా పడిపోయిందన్నారు. అలాగే విపక్షాల సూచనలు తప్పకుండా స్వీకరిస్తామని, తనకు రాష్ట్ర అభివృద్దితో పాటు.. ప్రజా సంక్షేమం కూడా అవసరమన్నారు. మూసీ నిర్వాసితులకు ఒక మంచి జీవితాన్ని ఇద్దామని, అందుకు ప్రభుత్వం తరపున చేయవలసిన ప్రతి చర్య తాను ముందుండి సాగిస్తానన్నారు.
Also Read: Posani Murali Krishna : కొండా సురేఖ వివాదంపై స్పందించని బాలయ్య… పోసాని షాకింగ్ కామెంట్స్
బీఆర్ఎస్ ఖాతాలో రూ.15 వందల కోట్లు ఉన్నాయి.. రూ.500 కోట్లు పేదలకు ఇవ్వొచ్చు కదా? అంటూ ప్రశ్నించారు. అలాగే విపక్ష నేతలతో కమిటీ ఏర్పాటు చేస్తాం.. మీరొచ్చి మాకు సూచనలు ఇవ్వండి అంటూ రేవంత్ (Cm Revanth Reddy) పిలుపునిచ్చారు.
కాగా.. మూసీ సుందరీకరణకు ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల మొదట కొంత వ్యతిరేకత కనిపించినా.. ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగా ప్రజల సహకారం అందుతుందని చెప్పవచ్చు. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా.. అక్రమ కట్టడాలు కూల్చివేస్తుండగా.. మంత్రుల వరుస ప్రకటనలు, ప్రభుత్వ హామీలతో మూసీ సుందరీకరణ పనులకు పూర్తిగా మార్గం సుగమమైందని కాంగ్రెస్ భావిస్తోంది.
అయితే బాధితులకు తాము అండగా ఉంటామని, అందరికీ న్యాయం చేస్తామని తాజాగా సీఎం (Cm Revanth Reddy) ఇచ్చిన ప్రకటన బాధితుల్లో మరింత విశ్వాసాన్ని నింపిందని చెప్పవచ్చు. మరి రూ.500 కోట్లు ఇవ్వాలని కోరిన సీఎం ఇచ్చిన పిలుపుకు బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.