PM Kisan : వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా రైతులకు కేంద్రం అందజేస్తున్న పీఎం కిసాన్ పథకంపై సెంట్రల్ గవర్నమెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. నిధులు పక్కదారి పట్టుకుండా.. పారదర్శకత కోసం ఈ–కేవైసీ ప్రక్రియను పూర్తిచేసిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ పథకం కింద నిధులు జమ చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది.
రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ–కేవైసీ ప్రక్రియను పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఈ నెలాఖరులోపు రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ–కేవైసీ ప్రక్రియను పూర్తిచేయాలని, లేకపోతే జనవరిలో విడుదల చేయనున్న 13వ విడత పీఎం కిసాన్ నిధులను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ–కేవైసీ ప్రక్రియ ఉద్దేశం రైతుల వాస్తవికతను ధ్రువీకరించుకోవడం కోసమేనని కేంద్రం వెల్లడించింది.
కేంద్రం ఆదేశాలతో ఏపీ సర్కార్ చర్యలు ప్రారంభించింది. అర్హులైన లబ్ధిదారుల ఈ–కేవైసీ ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి ఆదేశించారు.
ఏపీలో 49లక్షల 13వేల మంది రైతులు ఉండంగా, వారిలో 35లక్షల 16వేల మంది రైతుల ఈ–కేవైసీ ప్రక్రియను పూర్తయిందన్నారు. ఇంకా 13,96వేల మంది రైతుల ఈ–కేవైసీ పెండింగ్లో ఉందని సీఎస్ చెప్పారు. వారికి ఈ నెలాఖరులోపు పూర్తి చేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
రైతులందరూ పీఎం కిసాన్ ప్రయోజనం పొందేలా వెంటనే ఈ–కేవైసీని పూర్తి చేసుకోవాలని ఏపీ సీఎస్ సూచించారు. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీలోపు 13వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.