Dominica Citizenship| ప్రకృతి అందాలకు మారుపేరైన ఒక కరేబియన్ దీవి దేశం పౌరసత్వాన్ని విక్రయిస్తోంది. అది కూడా తక్కువ ధరకే. ఆ దేశమే డొమినికా. కరేబియన్ దీవులలో ఎత్తైన పర్వతాలు, భారీ జలపాతాలు గల దీవి డొమినికా. ఏడేళ్ల క్రితం డొమినికా దీవిలో హరికేన్ మారియా తుఫాను వల్ల భారీస్థాయిల నష్టం వాటిల్లింది. దీంతో దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పిడింది.
అప్పటినుంచి డొమినికా ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. గత కొనేళ్లుగా అక్కడి ప్రభుత్వం రెండు ప్రధాన సమస్యలతో పోరాడుతోంది. ఒక ప్రకృతి వైపరీత్యం, మరొకటి ఆర్థిక సంక్షోభం. అయితే ఆర్థికంగా కోలుకుంటేనే ప్రకృతి వైపరీత్యాలకు పరిష్కారం సాధించగలమని నమ్మింది. అందుకే ధనిక దేశాల వద్ద లేదా ప్రపంచ బ్యాంకు వద్ద రుణం కోసం చేయిచాచకుండా స్వతహా ఆర్థిక సంక్షోభంతో పోరాడాలని నిర్ణయం తీసుకుంది.
డొమినికా దేశంలో కేవలం 71000 మంది జనాభా మాత్రమే ఉన్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం తన చరిత్ర నుంచి ఒక ఉపాయం బయటికి తీసింది. 1990వ దశకంలో డొమినికా ప్రభుత్వం దేశ జనాభా పెంచేందుకు ఇతర దేశాల పౌరులను ఆహ్వానించింది. తమ దేశ పౌరసత్వం విక్రయించాలని నిర్ణయించింది. డొమినికా ప్రభుత్వం వద్ద ప్రజల కనీస అవసరాల తీర్చేందుకు కూడా డబ్బులు లేవు. హరిరేన్ మరియా తుఫాను విధ్వంసం కారణంగా చాలా మంది ఇళ్లు కోల్పోయారు. దేశంలోని ఆస్పత్రులు, బ్రిడ్జీలు, రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. వీటన్నింటినీ రిపేరు చేయాలంటే ప్రభుత్వ ఖజానాలో తగినన్ని డబ్బులు లేవు. పోనీ ఆదాయం విషయంలో మిగతా కరేబియన్ దీవులతో పోటీ ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఈ సమస్యలన్నింటినీ పరిష్కిరించడానికి డొమినికా ప్రభుత్వం ఇతర దేశాల ధనికులను టార్గెట్ చేయాలని నిర్ణయించింది. అందుకే 1990 దశకంలో లాగా మళ్లీ పౌరసత్వం విక్రయించాలని నిర్ణయించింది. ముఖ్యంగా చైనా, అరబ్బు దేశాలలో (దుబాయ్, సౌదీ, బహ్రెయిన్, కతార్ ) ధనవంతులు ఎక్కువగా ఉండడంతో వారికి పౌరసత్వం విక్రయిస్తున్నట్లు డొమినికా ఆర్థిక మంత్రి ఇర్వింగ్ మెకిన్టైర్ తెలిపారు. అమెరికా వార్తా సంస్థ ది వాషింగ్టన్ పోస్ట్ తో ఇటీవల ఆయన మాట్లాడుతూ.. ”మేము స్వతహాగా ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించుకోవాలనుకుంటున్నాం. ప్రకృతి వైపరీత్యాలకు కూడా ప్రత్యమ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాం.” అని చెప్పారు.
అయితే డొమినికా పౌరసత్వం ధరని అక్కడి ప్రభుత్వం ఇటీవల పెంచింది. ప్రపంచంలోని ఏ దేశపు పౌరులైనా డొమినికా పాస్పోర్టు పొందాలంటే 2 లక్ష డాలర్లు (రూ.1.68 కోట్లు) చెల్లించాలి. ఇది కనీస ధర. ఇతర దేశాల పౌరసత్వంతో పోలిస్తే.. ఇది చాలా తక్కువ అని ది వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో ప్రచురించింది.
హరికేన్ మరియా తుఫాను వల్ల జరిగిన విధ్యంసంలో డొమినికా ప్రభుత్వం ఎదుర్కొన్న నష్టం ఆ దేశ జిడిపీకి రెండింతలు. అందుకే డొమినికా ప్రధాన మంత్రి రూస్ వెల్ట్ స్కెర్రిట్ తన దేశాన్ని తిరిగి నిర్మిస్తానని.. భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకునేలా బలమైన నిర్మాణాలు చేసేందకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ధనిక దేశాల వల్ల వచ్చే కాలుష్యం కారణంగానే కరేబియన్ దీవుల్లో హరికేన్ తుఫాన్లు తరుచూ సంభవిస్తున్నాయని విమర్శలు కూడ గుప్పించారు.