Perni Nani Comments: నా వెంట్రుక కూడా పీకలేరు.. కోసి కారం పెట్టండి.. ముందుంది అసలు జాతర.. ఈ మాటలు విని ఇదేదో కొత్త సినిమా డైలాగ్స్ అనుకోవద్దు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు మాజీ మంత్రి, వైసీపీ నేత, పేర్ని నాని (Perni Nani). ప్రకాశం జిల్లాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
మాజీ సీఎం జగన్ ఎన్నికల సమయంలో పాల్గొన్న పలు బహిరంగ సభల్లో డైరెక్ట్ గా.. నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ.. చేతులతో సైగ చేస్తూ చేసిన కామెంట్స్ అప్పుడు వైరల్ అయ్యాయి. ఈ కామెంట్స్ కి కూటమి పార్టీలు కూడా అలాగే ధీటుగా జవాబిచ్చాయి. కాగా తాజాగా ఇదే రీతిలో మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్స్ అదే రీతిలో వైరల్ గా మారాయి. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులుగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భాద్యతలు స్వీకరించారు. ఈ సభలో మాజీ మంత్రి పేర్ని నాని పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
ఇంతకు నాని మాట్లాడుతూ ఏమన్నారంటే.. అబద్దపు హామీలతో అధికారం చేజిక్కించుకున్న కూటమి.. హామీలు నెరవేర్చలేక అపసోపాలు పడుతుందన్నారు. అలాగే వైసీపీ అధికారం సమయంలో తాము కార్యకర్తలను పట్టించుకోలేదన్న విషయం వాస్తవమేనని, అందుకు తగిన గుణపాఠం లభించిందన్నారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ.. కార్యకర్తలను విస్మరించిన విషయాన్ని వైయస్ జగన్ కూడా తెలుసుకున్నారన్నారు. అందుకు జగన్ కూడా చింతిస్తున్నారని, కార్యకర్తలు కష్టకాలంలో తోడు ఉండాలన్నారు.
అలాగే అధికారం ఉందని టీడీపీ నాయకులు విర్రవీగుతున్నారని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. నాలాంటి నాయకులు వస్తుంటారు.. పోతుంటారు కానీ మీకు జగన్ ముఖ్యం.. జగన్ పరిపాలన ముఖ్యమన్నారు. అలాగే ఇప్పుడు అధికారం ఉందన్న అభిప్రాయంతో టీడీపీ ఏమి చేస్తుంది.. మహా అయితే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిస్తుంది అంతేకదా అంటూ.. మన వెంట్రుక కూడా ఎవరు పీకలేరు అంటూ సంచలన కామెంట్ చేశారు నాని. అంతటితో ఆగక.. టీడీపీ కూటమి నేతలకు వైసీపీ కార్యకర్తలు.. అచ్చం జగన్ చెప్పినట్లే కోసి కారం పెట్టినట్లు సమాధానం చెప్పాలని, అప్పుడే వైసీపీ బలం ఏమిటో కూటమికి తెలుస్తుందన్నారు.
తాను ఇంట్లో బైబిల్ చదువుతాను కానీ బయట అందరు దేవుళ్లను విశ్వసిస్తాను అంటూ జగన్ తెలిపిన మాటకు టీడీపీ వక్రీకరించిందన్నారు. తాము ఎన్నికల సమయంలో ఒకే రీతిలో ఉండేవారమని, ఎన్నికలు అయ్యాక కూడా తమలో ఎటువంటి మార్పు రాలేదన్నారు. ఏదిఏమైనా నాని చేసిన కామెంట్స్.. పొలిటికల్ వార్ కి దారి తీశాయని రాజకీయ విశ్లేషకుల అంచనా.