KTR Serious Comments on CM Revanth Reddy: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.’రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు నాపై ఇష్టం వచ్చినట్లు గబ్బు మాటలు మాట్లాడుతున్నారు. నాపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై కోర్టులో పరువు నష్టం దావా వేశాను. అదేవిధంగా రేపోమాపో సీఎం రేవంత్ రెడ్డిపై కూడా పరువు నష్టం దావా వేస్తాను. తప్పు చేయనప్పుడు మేము ఎందుకు భయపడాలి. ప్రధాని మోదీ లాంటి వ్యక్తికే భయపడలేదు.. రేవంత్ రెడ్డి ఎంత’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
Also Read: కేసీఆర్ కి బిగ్ షాక్.. మూసీ ప్రక్షాళనలో రేవంత్ రెడ్డికి సపోర్ట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే
ఇదిలా ఉంటే.. గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో సోషల్ మీడియా ట్రోలింగ్ రాజకీయం కొనసాగుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ట్రోలింగ్ విషయమై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ వార్ కొనసాగుతోంది. తనపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి వాటిని ట్రోలింగ్ చేస్తున్నారంటూ మంత్రి కొండా సురేఖ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాను మనోవేదనకు గురైనట్లు మంత్రి కంటతడి పెట్టారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్, కేసీఆర్ ను ఆమె హెచ్చరించారు. మీ ఇష్టానుసారంగా పోస్టులు పెడితే జాగ్రత్త.. ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఖచ్చితంగా తగిన గుణపాఠం తప్పదన్నారు. ఆ పోస్టులను మీ ఇంట్లో ఉన్న మహిళలకు చూపించండి… అప్పుడు వాళ్లు ఏం సమాధానం చెబుతారో చూడండి అంటూ కేటీఆర్ పై ఆమె ఫైరయ్యారు.
ఆ తరువాత కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. మంత్రి గారివి దొంగ ఏడుపులు, పెడ బొబ్బలన్నారు. తమపై వ్యాఖ్యలు చేసేముందు కొండా సురేఖ ఒకసారి ఆమె గతాన్ని గుర్తుచేసుకోవాలన్నారు. ఇష్టానుసారంగా గతంలో తమపై వ్యాఖ్యలు చేయలేదా అంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో తాము బాధపడ్డామన్నారు. తమ ఇంట్లో ఉన్న మహిళలు కూడా బాధపడరా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం, మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వారి నోళ్లను ఫినాయిల్ తో కడగాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read: హైదరాబాద్ వేదికగా ఒలింపిక్స్, టార్గెట్ 2036: సీఎం రేవంత్
కాగా, కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ మరోసారి ఫైరయ్యారు. కేటీఆర్ తీరు మారడంలేదన్నారు. ఓ హీరోయిన్ పేరు ఎత్తుతూ.. సదరు హీరోయిన్ తన భర్త నుంచి విడాకులు తీసుకోవడానికి కేటీఆరే కారణమంటూ ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖపై సినిమా ప్రముఖులు ఫైరయ్యారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ఆర్జీవీతోపాటు సినిమా పెద్దలు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ సదరు హీరోయిన్ కు క్షమాపణలు చెప్పారు. కేటీఆర్ పై ఆగ్రహంతో మాట్లాడానే తప్ప మరోటి కాదంటూ వ్యాఖ్యానించారు. ఆ తరువాత కూడా మంత్రి కొండా సురేఖ.. కేటీఆర్ పై పలు వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ లో పర్యటించిన ఆమె కేసీఆర్ కనబడటంలేదంటూ ఆరోపణలు చేశారు. కేటీఆరే ఆయనను ఏమైనా చేసి ఉండొచ్చని, ఇందుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ మంత్రి పేర్కొన్నారు.