India China Border : భారత్- చైనాల మధ్య సరిహద్దు వివాదం మరోసారి చర్చనీయాంశమైన వేళ.. ఇరుదేశాల సంబంధాలపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కీలక వ్యాఖ్యలు చేశారు. మరింత స్థిరమైన, పటిష్ఠమైన సంబంధాల దిశగా భారత్తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందని చెప్పారు.
దౌత్య, సైనిక మార్గాల ద్వారా చైనా, భారత్లు.. నిరంతరాయంగా చర్చలను కొనసాగిస్తున్నాయని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో స్థిరత్వాన్ని కొనసాగించేందుకు రెండు దేశాలూ కట్టుబడి ఉన్నాయని ప్రకటన ఇచ్చారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు స్థిరమైన, బలమైన వృద్ధి దిశగా భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధం ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ వెబ్సైట్ ఓ ప్రకటన విడుదల చేసింది.
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో ఇటీవల భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న వేళ తాజా ప్రకటన వెలువడింది. సరిహద్దుల వద్ద యథాతథ పరిస్థితిని చైనా ఏకపక్షంగా మార్చాలని చూసిందని, ఈ చర్యలను భారత సైనికులు అడ్డుకొన్నారంటూ తవాంగ్ ఘర్షణపై గత వారం భారత్ స్పందించింది.
ఈ పరిణామాల నడుమ ఈనెల 20న చుశుల్ – మోల్డో సరిహద్దు ప్రాంతంలో చైనా భూభాగంలో 17వ విడత భారత్- చైనా కోర్ కమాండర్ల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అయితే, ఎలాంటి నిర్దిష్టమైన నిర్ణయాలు వెలువడలేదు. మధ్యంతర పరిష్కారంగా పశ్చిమ సెక్టార్లో ప్రస్తుతం ఉన్న భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించాలని ఇరు దేశాల సైనికాధికారులు నిశ్చయించారు.