Elon Musk Brazil| బ్రెజిల్ దేశంలో ఎలన్ మస్క్కు అంత సులువుగా కష్టాలు తప్పేలా లేవు. రెండు నెలల క్రితం ట్విట్టర్ ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై బ్రెజిల్ సుప్రీం కోర్టు నిషేధిస్తూ.. దాదాపు 30 మిలియన్ డాలర్లు ఫైన్ కూడా విధించింది. అయితే ఎక్స్ యజమాని అయిన ఎలన్ మస్క్ ఈ విషయంలో గత రెండు నెలలుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు.
తాజాగా ఎక్స్ కంపెనీ ప్రతినిధులు సుప్రీం కోర్టు విధించిన ఫైన్ మొత్తాన్ని బ్యాంకులో చెల్లించారు. ఆ తరువాత శుక్రవారం, అక్టోబర్ 4, 2024న కోర్టులో ఇక ట్విట్టర్ సేవలు బ్రెజిల్ లో పున:ప్రారంభించేందుకు అనుమతులు ఇవ్వాలని పిటీషన్ వేశారు. కానీ ఈ పిటీషన్ ని విచారణ చేసిన బ్రెజిల్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి మళ్లీ ఎక్స్ తరుపన వాదించే లాయర్లకు చుక్కలు చూపించారు. వారు తప్పుడు బ్యాంకులో ఫైన్ చెల్లించారని.. ఆ మొత్తం సరైన బ్యాంకులో చెల్లించాక తిరిగి రావాలని చెబుతూ విచారణను వాయిదా వేశారు. ఎక్స్ కంపెనీ ఫైన్ చెల్లించిన తరువాత ప్రాసిక్యూషన్ తో సంప్రదించి ఆ తరువాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీంతో ఖంగుతిన్న ఎక్స్ లాయర్లు వెనుతిరిగారు.
ఆగస్టు 2024లో బ్రెజిల్ సుప్రీం కోర్టు లో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్ ‘కు వ్యతిరేకంగా ఒక పిటీషన్ దాఖలు అయింది. ఎక్స్ కంపెనీ బ్రెజిల్ దేశ నియమాలను పాటించడం లేదని, విద్వేషం రెచ్చగొట్టే పోస్ట్ లు ఎవరు చేసినా వాటని ఎక్స్ బ్లాక్ చేయడం లేదని ఆ పిటీషన్ లో ఉంది. ఈ కేసు విచారణ స్వయంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలెగ్జాండర్ డి మొరెయిస్ చేపట్టారు. అయితే ఎక్స్ తరపున విదేశీ లాయర్లు వాదించడాన్ని ఆయన అంగీకరించలేదు. వెంటను ఎక్స్ సంస్థ బ్రెజిల్ న్యాయవాదులను నియమించాలని ఆదేశించారు.
న్యాయమూర్తి అలెగ్జాండర్ ఆదేశాలపై ఎలన్ మస్క్ అప్పట్లో విమర్శలు చేయడంతో వివాదం ఇంకా ముదిరింది. దీంతో సుప్రీం కోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ ట్విట్టర్ ఎక్స్ ను నిషిధిస్తూ.. 30 మిలియన్ డాలర్లు ఫైన్ విధించారు.
ట్విట్టర్ ఎక్స్ కు బ్రెజిల్ దేశంలో భారీ సంఖ్యలో యూజర్లున్నారు. సుప్రీం కోర్టు నిర్ణయంతో ఎక్స్ కు భారీ నష్టం జరిగింది. ఇక చేసేది లేక ఎలన్ మస్క్ సోషల్ మీడియా కంపెనీ సెప్టెంబర్ 26న సుప్రీం కోర్టులో తిరిగి ఎక్స్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఇవ్వాలని మరో పిటిషన్ వేసింది.