Sankranthi Buses : కరోనా కారణంగా గత రెండేళ్లుగా సంక్రాంతి పండుగ లో జోష్ తగ్గింది. సొంతూర్లకు వెళ్లాలని జనం అనుకున్నా.. ఆంక్షలు, పరిస్థితుల కారణంగా చాలా తక్కువ మందే వెళ్లారు. ఈ సారి మాత్రం పెద్ద సంఖ్యలో సొంతూర్లకు వెళ్లేందుకు జనం సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ నుంచి 15 లక్షల మంది వరకూ ఏపీకి వెళ్లే అవకాశం ఉందని ఓ అంచనా.. దీంతో.. ఇందుకు తగ్గట్టుగా బస్సు సర్వీసులను అందించనున్నాయి తెలంగాణ, ఏపీ రవాణ శాఖలు… స్పాట్
సంక్రాంతికి సందర్భంగా ఏపీలోని సొంతూళ్లకు వచ్చే వారి కోసం .. రవాణాశాఖ భారీ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నుంచి 18 వందల బస్సులతో.. 6,400 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.. జనవరి 6వ తేదీ నుంచి 18 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు వైపు వెళ్లే బస్సులను సీబీఎస్ నుంచి ప్రారంభమవుతాయి. ప్రత్యేక బస్సు సర్వీసుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేయనున్నారు. ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పించారు.
ఇక టీఎస్ ఆర్టీసీ సంక్రాంతి పండగకు సొంతూళ్లుకు వెళ్లే వారి కోసం 15 వందల బస్సులను సిద్ధం చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం 4,233 ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది. జనవరి 7 నుంచి 15వ తేదీ వరకు ఈ స్పెషల్ బస్ సర్వీసులు రన్ కానున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. మొత్తం 4,233 స్పెషల్ బస్సు సర్వీసుల్లో.. 585 బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. తెలంగాణలోని వివిధ పట్టణాలకే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రాధాన్యత ఉన్న ఏరియాలకు కూడా సంక్రాంతి స్పెషల్ బస్సులు నడుస్తాయి. గతేడాదితో పోలిస్తే 10 శాతం అదనంగా బస్సు సర్వీసులను పెంచామని సజ్జనార్ తెలిపారు.
సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల కోసం రెండు రాష్ట్రాల ఆర్టీసీలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా.. అవి సరిపోయే పరిస్థితి లేదు. సంక్రాంతికి కొన్ని నెలలు ముందుగానే ప్రయాణికులు రైలు టికెట్లు బుక్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే చాలా మందికి నిరాశే కలుగుతుంది. దీంతో.. ఏపీ, తెలంగాణ ఆర్టీసీ తో పాటు .. ప్రైవేటు ట్రావెల్స్ను కూడా ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఐతే.. ఈసారి రెండు రాష్ట్లా రవాణాశాఖలు సర్వీసులు పెంచిన నేపథ్యంలో.. ఇదివరకంత ఇబ్బంది ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.