DigiYatra Airport : విమానాశ్రయాల్లో ప్రయాణికుల ప్రవేశాలను మరింత సులభతరం చేసేందుకు, దేశంలో ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ (ముఖ గుర్తింపు సాంకేతికత – ఎఫ్ఆర్టీ) ఆధారంగా రూపొందించిన ‘డిజియాత్ర’ సేవలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీన్ని దేశీయ మార్గాల్లో ప్రయాణం కోసం మాత్రమే రూపొందించారు. అయితే ఇప్పుడు విమానాల్లో విదేశాలకు వెళ్లే వారికి సైతం ఈ సేవలను అందుబాటు లోకి తెచ్చేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
అంతర్జాతీయ విమానాశ్రయాల్లోకి సౌకర్యవంతంగా, త్వరగా ప్రవేశించేందుకు వీలుగా ఈ ఎఫ్ఆర్టీని వినియోగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి ప్రయోగాత్మక ప్రాజెక్ట్ను 2025 జూన్లో ప్రారంభించనుందట. ఈ విషయాన్ని డిజియాత్ర సీఈఓ కె. సురేశ్ స్యయంగా వెల్లడించారు. ఇకపై ప్రయాణికుల ప్రయాణం మరింత సులభతరం కానుందని తెలిపారు.
“అంతర్జాతీయ ప్రయాణం కోసం ఎఫ్ఆర్టీని ఉపయోగించాలంటే, ఇక్కడితో పాటు విమానం గమ్యం చేరే దేశం కూడా ఒప్పుకోవాలి. అందుకే 2025 జూన్లో రెండు దేశాల మధ్య ప్రయాణానికి ఈ ఎఫ్ఆర్టీ సదుపాయాన్ని వినియోగించాలని అనుకుంటున్నాం” అని సురేశ్ చెప్పుకొచ్చారు.
సెల్ఫీ దిగితే చాలు – దేశీయ మార్గాల్లో ప్రయాణం కోసం ఎఫ్ఆర్టీని ఉపయోగించేలా డిజియాత్ర యాప్ను డెవలప్ చేశారు. అంటే మానవ ప్రమేయం లేకుండానే విమానాశ్రయాల్లో వేగంగా చెకిన్ కొరకు డిజిటల్ తనిఖీలో భాగంగా ‘డిజియాత్ర’ యాప్ సేవలను ప్రారంభించారు. ఆధార్ ఆధారంగా మైనర్లతో పాటు పెద్దల వివరాలను ఈ ఎఫ్ఆర్టీలో నిక్షిప్తం చేస్తారు. దీని కోసం ప్రతి ఒక్కరి ముఖాన్ని సెల్ఫీ ద్వారా తీసుకుంటారు. దీంతో ప్రయాణికులు తమ తదుపరి ప్రయాణానికి ముందు బోర్డింగ్ పాస్ వివరాలను ఈ ఎఫ్ఆర్టీ ఫీచర్లో జత చేస్తే సరిపోతుంది.
READ ALSO : టాప్ సీక్రెట్… అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ నిజమైన ధరలు తెలుసుకోండిలా!
ఏఏ విమానాశ్రయాల్లో ఉందంటే? – ఇప్పటికే భారత్ లో హైదరాబాద్తో పాటు విశాఖపట్నం, బెంగళూరు, దిల్లీ, కోల్కతా, వారణాసి, ముంబయి, పుణె, కొచి సహా పలు విమానాశ్రయాల్లో ఈ డిజియాత్ర కోసం ప్రత్యేక ప్రవేశ మార్గాలు ఉన్నాయి. అక్కడ ప్రవేశ మార్గాలు దగ్రర ఓ స్కానర్ ఉంటుంది. అందులో మన మొబైల్లోని డిజియాత్ర యాప్లో ఉన్న బోర్డింగ్ పాస్ను స్కాన్ చేయాలి. అక్కడే ఉన్న కెమెరా ఎదుట మన ముఖాన్ని ఉంచాలి. అప్పుడు సెకన్ల వ్యవధిలోనే అనుమతి పొంది, ఆటోమేటిక్గా గేట్లు తెరచుకుంటాయి. ఇక ఈ ఎంట్రీ సమయంలో డాక్యుమెంట్లను ఫిజికల్గా తనిఖీ చేసే వారు సైతం ఉండరు. దీంతో అత్యంత వేగంగా విమానాశ్రయంలోకి వెళ్లిపోవచ్చు. ఆలస్యం అవుతుందనే సమస్య ఉండదు. లైన్ లో ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం దేశీయ గమ్యస్థానాలకే ఈ ఎఫ్ఆర్టీని అనుమతిస్తున్నారు.
మరి అంతర్జాతీయ ప్రయాణాలకు? – సాధారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు చేయాలంటే పాస్పోర్ట్, వీసా, ఇమిగ్రేషన్ వంటి వ్యవహారాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. దీంతో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, వీసా జారీ వ్యవస్థలతో సమన్వయం చేసుకోవాలి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ప్రయాణాల కోసం వచ్చే ఏడాది నుంచి భారతీయులకు ఇ-పాస్పోర్ట్ జారీ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సింగపూర్తో పాటు పలు ఐరోపా దేశాలు ఇ-పాస్పోర్ట్లను జారీ చేస్తున్నాయి.