Haryana assembly election 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం మొదలైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది.
మొత్తం 90 స్థానాలకు హర్యానా అసెంబ్లీకి మొత్తం 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 101 మంది మహిళలు ఉన్నారు. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, ఆప్, ఐఎన్ఎల్డీ-బీఎస్పీ, జేజేపీ-ఆజాద్ సమాజ్ పార్టీలు పోటీ పడుతున్నాయి. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్-బీజేపీ మధ్య కొనసాగుతోంది.
2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం దాదాపు 20 వేలకు పైగానే పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. హర్యానాలో దశాబ్దంగా అధికారంలో ఉన్న బీజేపీ, ఈసారి హ్యాట్రిక్ నమోదు చేయడం కష్టమనే వాదన బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా రైతులు ఆ పార్టీపై గరంగరంగా ఉన్నట్లు సమాచారం.
దీనికితోడు జాట్ల ప్రాబల్యం కమలనాధులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. 90 స్థానాల్లో 37 చోట్ల జాట్ లదే ఆధిపత్యం. దీనికితోడు సైన్యంలో తీసుకొచ్చిన అగ్నిపథ్ వ్యవహారంపై యువత ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు ముఖ్యమంత్రి మార్చింది బీజేపీ. ఓబీసీ నేతను తెరపైకి తీసుకొచ్చింది. కాకపోతే రిమోట్ కంట్రోల్ అంతా ఢిల్లీ పెద్దల చేతుల్లో ఉందనే వాదన లేకపోలేదు.
ALSO READ: హిమాచల్ ప్రదేశ్ లో టాయిలెట్ ట్యాక్స్.. అదనపు టాయిలెట్ ఉంటే పన్ను చెల్లించాలి?..
ఈసారి కాంగ్రెస్కు జాట్లతోపాటు ముస్లిం వర్గాలు మద్దతుగా నిలుస్తారని కొండంత ఆశలు పెట్టుకుంది. గాంధీ ఫ్యామిలీకి విధేయుడిగా ఉన్న మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా ఈసారి చక్రం తిప్పారు. అభ్యర్థుల ప్రకటనలోనూ ఆయనదే కీలకపాత్ర. 72 మంది విధేయులకు టిక్కెట్లు ఇప్పించుకున్నారంటే ఆయనపై కాంగ్రెస్ హైకమాండ్ ఎంత నమ్మకం పెట్టుకుందో అర్థమవుతుంది.