Gurmeet Ram Rahim| హర్యాణా, పంజాబ్ రాష్ట్రాలలో పేరొందిన స్వామిజీ అయిన గుర్మీత్ రామ్ రహీమ్ ఇద్దరు మహిళల రేప్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే హర్యాణా ఎన్నికలకు కొద్ది రోజుల ముందే బాబా రామ్ రహీమ్ పెరోల్ పైన జైలు నుంచి బయటికి రావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఎందుకంటే 2017 సంవత్సరంలో తన మహిళా భక్తులపై అత్యాచారం చేశాడని కోర్టులో నిరూపితం కావడంతో జైలు శిక్ష అనుభవిస్తున్న బాబా రామ్ రహీమ్ ఇప్పటివరకు జైలు నుంచి 15 సార్లు పెరోల్ పై వచ్చి 275 రోజులు బయటే ఉన్నాడు. కేవలం గత రెండు సంవత్సరాలలో 10 సార్లు జైలు నుంచి పెరోల్ పై బయటికి వచ్చాడు.
సామాన్య జైలు ఖైదీలకు పెరోల్ లభించడం దాదాపు అసాధ్యం. కానీ ఈ డేరా బాబాకు మాత్రం కోరినప్పుడల్లా పెరోల్ లేదా ఫర్లో పేరుతో సులువుగా అనుమతి లభిస్తోంది. పైగా రాజకీయ కార్యక్రమాలు లేదా ఎన్నికలు ఉన్న సమయంలో అయితే రామ్ రహీమ్ బాబా తప్పకుండా పెరోల్ పై బయటికి రావడం గమనార్హం. ఈ సారి హర్యాణా రాష్ట్రంలో ఎన్నికలుండడంతో పోలింగ్ కు కొన్ని రోజుల ముందే ఈ బాబాజీ బయటికి వచ్చాడు. దీనికి ప్రధాన కారణం హర్యాణా ప్రభుత్వం ఇతనికి అడిగినప్పుడల్లా పెరోల్ కు అనుమతి ఇస్తోంది.
Also Read: సోషల్ మీడియా పిచ్చి పీక్స్.. రీల్స్ చేసేందుకు హైవే సైన్బోర్డుపై పుల్ అప్స్!
హర్యాణాలోని సిర్సా ప్రాంతంలో డేరా సచ్చాసౌదా పేరుతో గుర్మీత్ రామ్ రహీమ్ బాబాకు ఒక ఆశ్రమం ఉంది. ఆయనకు లక్షల్లో భక్తులున్నారని జాతీయ మీడియా కథనం ప్రచురించింది. అందుకే ఆయన జైలులో ఉన్నా సోషల్ మీడియా ద్వారా ఎన్నికల్లో బాబా భక్తులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం ఏడు సార్లు ఎన్నికల సమయంలో రామ్ రహీమ్ బాబా జైలు నుంచి బయటికి వచ్చాడు.
ఎన్నికల ముందు రామ్ రహీమ్ బాబా పెరోల్ పై జైలు నుంచి బయటికి వచ్చిన తేదీలు ఇవే:
ఫిబ్రవరి 2022 : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు 21 రోజుల ముందు రామ్ రహీమ్ తొలిసారి 21 రోజుల ఫర్లో పై బయటికి వచ్చాడు.
జూన్ 2022 : హర్యాణా మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు 30 రోజుల ముందు పెరోల్ పై జైలు నుంచి బయటికి రావడానికి అనుమతి లభించింది.
అక్టోబర్ 2022 : హర్యాణా రాష్ట్రంలోని ఆదంపూర్ నియోజకవర్గంలో ఉపఎన్నికల సమయంలో ఏకంగా 40 రోజులు పెరోల్ పై బయటికి రామ్ రహీమ్ బాబా వచ్చాడు.
జూలై 2023 : హర్యాణాలో రాష్ట్రం వ్యాప్తంగా జరిగిన పంచాయత్ ఎన్నికల సమయంలో డేరా బాబాకు 30 రోజుల పెరోల్ కు అనుమతి లభించింది.
నవంబర్ 2023 : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు 29 రోజులపాటు పెరోల్ పై బయటే ఉన్నాడు ఈ రేపిస్ట్ బాబా.
జనవరి 2024 : 2024 సంవత్సరంలో జరిగిన లోక్ సభ ఎన్నికల సమయంలో అత్యధికంగా 50 రోజుల పెరోల్ లభించింది.
ఆగస్టు 224 : హర్యాణా అసెంబ్లీ ఎన్నికల సమయంలో 21 పెరోల్ పై బయటికి వచ్చాడు.
ఒక రేపిస్టు అయిన బాబాకు హర్యాణా ప్రభుత్వం ఇన్నిసార్లు రిపీట్ గా పెరోల్ అనుమతి ఇవ్వడంపై విమర్శులు వెలువెత్తుతున్నాయి. రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు కేంద్రలోని బిజేపీ, హర్యాణా రాష్ట్రంలోని బిజేపీ నాయకులు అత్యాచారం కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి ఇంతగా ఎందుకు ఆదరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలైన షిరోమణి అకాలి దల్, కాంగ్రెస్ , సిక్కుల సామాజిక సంస్థ షిరోమణు గురుద్వారా ప్రబంధక్ కమిటీ బహిరంగంగా ప్రశ్నిస్తున్నాయి. దేశంలో సామాన్యులకో న్యాయం, ధనవంతులకో న్యాయమా అని రాజకీయ పార్టీలు న్యాయవ్యవస్థను ప్రశ్నిస్తున్నాయి.
Also Read: ‘మీ కూతురు వ్యభిచారం చేస్తోంది’.. సైబర్ మోసగాళ్లు చెప్పిన అబద్ధం విని చనిపోయిన టీచర్..
జైలులో చాలా మంది బంది సిక్కులున్నారని.. వారంతా తమ జైలు శిక్ష పూర్తి చేసినా వారిని ప్రభుత్వం విడుదల చేయడం లేదని.. కానీ ఒక రేపిస్టు, ఒక హంతకుడు అయిన డేరా బాబకు మాత్రం ఇన్నిసార్లు పెరోల్ ఎలా ఇస్తారని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. 16 సంవత్సరాల క్రితం ఈ డేరా చీఫ్ బాబా ఒక జర్నలిస్టుని హత్య చేయించాడు. 2019లో డేరా బాబాతో పాటు, మరో ముగ్గురిని జర్నలిస్టు హత్య కేసులో కోర్టు దోషిగా తేల్చింది.
అయితే ఈసారి కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ కు డేరా బాబా పెరోల్ పై ఫిర్యాదు చేయడంతో అతడిని ఎన్నికల కమిషన్ హర్యాణా రాష్ట్రంలో అడుగు పెట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రామ్ రహీమ్ బాబా ఉత్తర్ ప్రదేశ్ లోని ఒక ఆశ్రమంలో ఉన్నాడు.