Corona : భారత్లో కరోనా మరో వేవ్ వచ్చే ఛాన్స్ తక్కువేనని సీసీఎంబీ ప్రకటించింది. ఇప్పటికే ప్రజలకు కరోనా హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసిందని ‘సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయోలజీ ’ డైరెక్టర్ వినయ్ కె నందికూరి ప్రకటించారు. ప్రస్తుతం చైనాలో బీఎఫ్-7 వేరియంట్ విజృంభిస్తోంది. కానీ ఈ వేరియంట్ తీవ్రత భారత్లో ఉండకపోవచ్చునని వినయ్ అభిప్రాయపడ్డారు. అలాగే డెల్టా వేరియంట్ అంత ప్రమాదకరం కాదని స్పష్టం చేశారు.
చైనా అనుసరించిన జీరో కొవిడ్ విధానమే ప్రస్తుతం ఆ దేశంలో వైరస్ విజృంభించడానికి కారణమని వినయ్ తెలిపారు. భారీగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగకపోవడం తీవ్రతను మరింత పెంచి ఉంటుందన్నారు. భారత్లో మాత్రం వృద్ధులకు కూడా బూస్టర్ డోసులు వేశారన్నారు. అయితే, భారత్లో మరో వేవ్ వస్తుందా? లేదా? అని ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమన్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మాత్రం తక్షణమే కరోనా వేవ్ వస్తుందని చెప్పేంత ముప్పు కనిపించడం లేదని వివరించారు. కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్స, వ్యాక్సినేషన్ అందరికీ అందుబాటులో ఉన్నాయన్నారు.
కరోనా నియంత్రణపై వినయ్ నందికూరి పలు సూచనలు చేశారు. కొవిడ్ వ్యాప్తి అరికట్టేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. కొత్తగా వచ్చే అన్ని వేరియంట్లకు రోగనిరోధకతను తప్పించుకునే గుణం ఉండొచ్చని హెచ్చరించారు. టీకా తీసుకున్నా.. గతంలో ఇతర వేరియంట్ల బారిన పడినవారికి మళ్లీ కరోనా సోకే ముప్పు లేకపోలేదన్నారు. మనం ఇప్పటికే అతిపెద్ద డెల్టా వేవ్ను చూశామని వివరించారు. వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాత ఒమిక్రాన్ వచ్చిందని చెప్పారు. వెంటనే బూస్టర్ డోసులు పంపిణీ చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలా ఏ రకంగా చూసినా చైనాతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉందని స్పష్టం చేశారు. అందుకే డ్రాగన్ దేశంలోని పరిస్థితులు భారత్ తలెత్తకపోవచ్చనని వినయ్ నందికూరి అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరోవైపు భారత్లో శనివారం 201 కొత్త కరోనా కేసులు వచ్చాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం క్రీయాశీలక కేసులు 3,397గా ఉన్నాయి. భారత్లో ఇప్పటికే నాలుగు బీఎఫ్-7 వేరియంట్ కేసులను గుర్తించినట్లు వార్తలు వచ్చాయి.