హైదరాబాద్, స్వేచ్ఛ: మూసీ ప్రక్షాళన ఎట్టి పరిస్థితుల్లో ఆగదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం అసోచాం ఆధ్వర్యంలో హెచ్ఐసీసీ నోవాటెల్ లో జరిగిన “అర్భన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2024” కు ముఖ్య అతిథిగా హాజరై ప్రతిపక్ష పార్టీల ద్వంద్వ విధానాలపై మండిపడ్డారు. మూసీ పేరుతో జైకా నుంచి వెయ్యి కోట్లు రుణం తీసుకున్న కేటీఆర్, అధికారం పోగానే మూసీ ప్రక్షాళన వద్దని గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, రాజకీయాలు తగదని ప్రతిపక్షాలకు సూచించారు.
స్థిరమైన మౌళిక వసతుల నిర్మాణం, రాష్ట్ర సుస్థిరాభివృద్ధి కోసం ప్రగతిశీల నిర్ణయాలు తీసుకుంటున్నామని, గత పదేండ్ల తెలంగాణ విధ్వంసాన్ని సరిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తూ, సమ్మిళిత, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలవైపు సాగుతున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న అర్బన్ కల్చర్కు అనుగుణంగా తెలంగాణలో కూడా పట్టణీకరణ జరగవలసిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అందుకోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం భవిష్యత్ సవాళ్ళను ఎదుర్కొనేందుకు, అభివృద్ధికి బలమైన పునాదులు వేయడంతో పాటు రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేసేందుకు అనేక మౌళిక సదుపాయాలను నిర్మిస్తున్నదని వివరించారు.
Also Read: TG Govt: త్వరలో ఆర్ఓఆర్ చట్టం అమలు.. ధరణి పోర్టల్ రద్దు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
హైదరాబాద్ దశ దిశను మార్చేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పిన మంత్రి, అందులో భాగంగానే రోడ్లు, ఆర్ఓబీలు, ఆర్యూబీలు, కొత్త లింక్ రోడ్లు నిర్మించడం వంటి కీలకమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నదని చెప్పారు. అంతేకాకుండా అర్బన్ ఏరియాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ సవాల్తో కూడుకున్నదని చెప్పిన మంత్రి, అందుకోసం ఎస్టీపీలు నిర్మించి మెరుగైన మురుగు నీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఓఆర్ఆర్ పరిధిలో దాదాపు 40 శాతం జనాభా నివసిస్తుందని, ఇది 2028 నాటికి 50 శాతం దాటే అవకాశం ఉందన్నారు.
అందుకు అనుగుణంగా పట్టణ విస్తరణ, మౌళిక వసతులను కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమ మంత్రుల బృందమంతా కలిసి మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేసేందుకు స్పీడ్ (స్మార్ట్, ప్రొయాక్టివ్,ఎఫీషీయంట్,ఎఫెక్టివ్ డెలివరీ) వంటి ప్రణాళికలతో 19 ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తిచేసేందుకు ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఇప్పటికే బడ్జెట్లో రూ.10,000 కోట్లు కేటాయించడమే కాకుండా, ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా మార్చడానికి అనేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని వివరించారు కోమటిరెడ్డి.