KVP Comments: నాపై లేనిపోని ఆరోపణలు వద్దు. నా భుజంపై తుపాకీ పెట్టి.. తెలంగాణలో అధికారంలో ఉన్న మా పార్టీకి గురి పెడతారా.. నేను మాట తప్పేవాణ్ణి కాను. నా కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో లేదు. ఉంటే నేనే కూల్చేస్తా అంటూ మాజీ రాజ్యసభ సభ్యులు, వైయస్సార్ ఆత్మగా పిలువబడే కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు.
హైదరాబాద్ లో ఎఫ్టిఎల్, బఫర్ జోన్ పరిధిలో గల అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చి వేస్తోంది. భవిష్యత్తులో వరదల ప్రభావం నగరంపై చూపరాదనే లక్ష్యంతో సీఎం రేవంత్.. హైడ్రాను రంగంలోకి దింపారు. అలాగే మూసీ నది ప్రక్షాళనకై, సుందరీకరణకై అక్కడి అక్రమ కట్టడాలను సైతం ప్రభుత్వం తొలగిస్తోంది. తాజాగా కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు కుటుంబ సభ్యులకు చెందిన ఓ ఫామ్ హౌస్ ఎఫ్టిఎల్, బఫర్ జోన్ లో పరిధిలోకి వస్తుందని, హైడ్రా కూల్చివేయాలని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణలతో సీఎం రేవంత్ కు ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన కేవీపీ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
సీఎంకు లేఖ రాయడంపై కేవీపీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ తనపై చేస్తున్న ఆరోపణలకు గతంలోనే తాను స్పందించానన్నారు. తన కుటుంబ సభ్యులకు చెందిన ఫామ్ హౌస్ లో ఏ కట్టడమైనా ఒక్క అంగుళం మేరకు ఎఫ్టిఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉంటే సొంత ఖర్చులతో కూల్చి వేయడం జరుగుతుందన్నారు. తాను ఎప్పటికీ ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని.. సంబంధిత అధికారులు మా ఫామ్ హౌస్ వద్దకు వచ్చి కొలతలు వేసి మార్కింగ్ ఇస్తే.. ఏమైనా అక్రమ కట్టడాలు ఉంటే తామే స్వచ్ఛందంగా తొలగిస్తామన్నారు. అయితే అధికారులు వచ్చే విషయాన్ని ముందుగానే తెలిపిన యెడల ప్రతిపక్ష నాయకులకు, వారి అనుకూల మీడియాకు తగిన సమాచారం ఇచ్చేందుకు వీలుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా తనకు చట్టం నుండి ఏమి మినహాయింపు వద్దని.. సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఏ విధంగా వ్యవహరిస్తుందో అదే విధంగా తనపరంగా కూడా వ్యవహరిస్తే చాలని సీఎంను కోరారు.