ChhattisgarhFake SBI Branch: ఇంతకాలం బ్యాంకుల పేరుతో ఆగంతకులు కాల్ చేసి అకౌంట్లలో డబ్బులు కొల్లగొట్టడం చూశాం. కానీ, ఇప్పుడు దొంగలు మరింత అప్ డేట్ అయ్యారు. ఆన్ లైన్ మానేసి నేరుగా ఆఫ్ లైన్ లో బ్రాంచ్ లను ఓపెన్ చేసి అందినకాడికి దండుకుంటున్నారు. అకౌంట్లు ఓపెన్ చేసిన ఖాతాదారులన నుంచి డబ్బులు దోచుకోవడంతో పాటు నకిలీ ఉద్యోగాల పేరుతో పలువురి నుంచి లక్షల రూపాయలు కొల్లగొట్టారు. చత్తీస్ గఢ్ లో జరిగిన ఈ కొత్తతరం మోసం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
మారుమూల గ్రామంలో నకిలీ ఎస్బీఐ ఏర్పాటు
ఛత్తీస్గఢ్ శక్తి జిల్లాలో నకిలీ బ్యాంకు కుంభకోణం బయటపడింది. మారుమూల గ్రామం అయిన ఛపోరాలో కొంత మంది కేటుగాళ్లు ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఆ ఊరిలోని ఓ కాంప్లెక్స్ లోని కొన్ని దుకాణాలను అద్దెకు తీసుకున్నారు. అచ్చం బ్యాంకు ఎలా ఉంటుందో అలా మార్చారు. ఫర్నీచర్, క్యాష్ కౌంటర్, మేనేజర్ రూమ్ సహా అన్నీ చూడ్డానికి ఎస్బీఐ బ్రాంచ్ ని మక్కీకి మక్కీ దించేశారు. కాంప్లెక్స్ ముందు మాంచి బోర్డును ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్తే చక్కటి ఏసీతో బ్యాంకు ఆహ్లాదకరంగా మార్చారు.
ఉద్యోగాల కోసం భారీగా లంచాలు
ఛపోరా గ్రామస్తులు బ్యాంకు లావాదేవీల కోసం చాలా దూరం వెళ్లాల్సి ఉండేది. కానీ, ఇప్పుడ తమ గ్రామంలోనే ఎస్బీఐ బ్యాంక్ ఓపెన్ చేయడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ బ్యాంకులో 90 శాతానికి పైగా స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. ఉద్యోగాల కోసం స్థానికుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. వారిలో కొందరిని సెలెక్ట్ చేసి, ఉద్యోగాలు ఇవ్వాలంటే కొంత డబ్బు జమ చేయాలన్నారు. ఉద్యోగాలు వస్తున్నాయనే ఆశతో అడిగినంత డబ్బు ఇచ్చారు. ఒక్కో వ్యక్తి నుంచి ఆయా ఉద్యోగాలను బట్టి రూ. 2 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు తీసుకున్నారు. ఉద్యోగ నియామకాల కోసం నకిలీ అపాయింట్ మెంట్ లెటర్స్ కూడా ఇచ్చారు. ఎంపిక చేసిన సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత విధుల్లోకి తీసుకున్నారు. సిబ్బంది అటెండెన్స్ కోసం బయోమెట్రిక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.
బ్రాంచ్ ఓపెన్ అయిన 10 రోజుల్లోనే బండారం బట్టబయలు
సొంతూరులో బ్యాంక్ ఓపెన్ కావడంతో స్థానికులు పెద్ద మొత్తంలో అకౌంట్లు ఓపెన్ చేశారు. ఎక్కుల లావాదేవీలు జరిపితే లోన్లు కూడా ఇస్తామని స్థానికులకు ఆశ చూపించారు. ఒక్కో ఇంట్లో సుమారు రెండు అకౌంట్లు తీసుకున్నారు. బ్యాంక్ ప్రారంభం అయిన 10 రోజులకు ఈ విషయం సమీపంలోని దబ్రా బ్యాంక్ మేనేజర్ కు తెలిసింది. వెంటనే ఆయన పోలీసులను తీసుకుని నకిలీ బ్యాంక్ కు వెళ్లారు. అచ్చం ఎస్బీఐ బ్యాంకు మాదిరిగా ఉండటంతో అందరూ షాక్ అయ్యారు. అక్కడి సిబ్బందిని విచారించడంతో ఫేక్ బ్యాంక్ అని తేలిపోయింది. నకిలీ బ్యాంక్ సూత్రధారులు పంకజ్, రేఖా సాహు, మందిర్ దాస్ సహా మరికొంత మందిని పోలీసులు అరెస్టు చేశారు. అటు బాధితులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయం బయటకు తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.
Read Also:ట్రైన్ ఫర్ సేల్.. సీరియస్ బయ్యర్స్ మాత్రమే ట్రై చేయండి- సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో!