YS Jagan Plan Success in Kadapa: ఎన్నికల ఫలితాల కడప జిల్లాలో వైసీపీ నేతలంతా అంతా సైలెంట్ అయిపోయారు. పార్టీ అధ్యక్షుడు జగన్పై కూటమి నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ సీఎం సొంత జిల్లాలో వైసీపీ నేతలు మీడియా ముందుకు రాలేకపోయారు. దాంతో సొంత జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటనిని క్యాడర్ అయోమయంలో పడుతున్న తరుణంలో మూడు నెలల అజ్ఞాతంలో ఉన్న నేతలు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. దాంతో కడప జిల్లా రాజకీయాల్లో మళ్లీ కదలిక మొదలయ్యే పరిస్థితి కనిపిస్తుంది.
ఉమ్మడి కడప జిల్లా మొన్నటి ఎన్నికల వరకు వైఎస్ కుటుంబం కంచుకోట. వైయస్ కుటుంబం అనుచరులే ఆ జిల్లాలో ఎక్కువ మంది శాసనసభ్యులుగా ఉండేవారు. జగన్ వైసీపీని ఏర్పాటు తర్వాత కూడా 2014 లో 9 స్థానాలు, 2019లో 10 కి 10 స్థానాలతో క్లిన్ స్వీప్ చేయగలిగారు. అయితే 2024 ఎన్నికల్లో మూడంటే మూడు స్థానాల్లో గెలిచి చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు తయారైంది ఆ పార్టీ పరిస్థితి. దాంతో ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గత మూడు నెలలుగా కూటమి నేతలు జగన్పై మాటల దాడి చేస్తున్నా జిల్లాలో కనీసం కౌంటర్ ఇవ్వలేని పరిస్థితి.
అయితే జగన్ కడప జిల్లా అధ్యక్షుడిగా తన మేనమామ, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి పగ్గాలు ఇచ్చాక ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. వైసీపీ అధినేత పై చేస్తున్న మాటల దాడిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకాలం సైలెంట్ మోడ్లోకి వెళ్లిన వారు మళ్ళీ యాక్టివ్ అవుతుండటంతో క్యాడర్లో కొంత ఉత్సాహం కనిపిస్తుంది. 2024 ఎన్నికల ముందు జిల్లాలో ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే లేక దీన పరిస్థితి లో ఉన్న టీడీపీకి మొన్నటి ఎన్నికలు ప్రాణం పోశాయి.10 కి 7 స్థానాల్లో గెలవడంతో జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు డైరెక్ట్గా జగన్ని టార్గెట్ చేస్తున్నారు.
Also Read: బాబుకు భయం లేదు.. భక్తి లేదు.. అన్నీ అబద్దాలే.. సుప్రీం ఆదేశాలపై జగన్ స్పందన
జగన్పై విమర్శలను ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నా అది ప్రజల్లోకి పెద్దగా వెల్లడం లేదన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాల నేతల్లో కొందరు కూడా కూటమి విమర్శలపై కౌంటర్ ఇస్తున్నారు. అయితే పది సెగ్మెంట్లో వైసీపీకి సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ .. కొందరు మాత్రం సౌండ్ చేయడం లేదు. టీడీపీ నుంచి ఎన్నికల ముందు వైసీపీలో చేరిన పులివెందుల నేత, మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి, రాయచోటి నాయకుడు రమేష్ రెడ్డిలు కూటమికి కౌంటర్లు ఇవ్వడంలో ముందుంటున్నారు. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు బయటికి రాకపోవడంతో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి నోటికి పని చెప్తున్నారు. మరి అన్ని నియోజకవర్గాల నాయకుల్ని యాక్టివ్ చేయడానికి జగన్ ఏ మంత్రం వేస్తారో చూడాలి.