Akhil Akkineni : గత రెండు రోజుల నుంచి మంత్రి కొండా సురేఖ, హీరో అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై చేసిన విమర్శలు టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టాలీవుడ్ మొత్తం ఏకమై కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించగా, నాగార్జున పరువు నష్టం దావా వేస్తూ కోర్టు మెట్లు ఎక్కారు. అయితే తన వ్యాఖ్యలు దుమారం రేపడంతో మంత్రి సురేఖ దిగి వచ్చి, క్షమాపణలు చెప్పడమే కాకుండా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంది. కానీ ఈ వివాదంపై అక్కినేని కుటుంబం మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఇప్పటికే సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ నాగార్జున, నాగ చైతన్య, సమంత వరుస ట్వీట్స్ చేయగా, తాజాగా అఖిల్ అక్కినేని ఆమెపై తీవ్రంగా మండిపడ్డారు.
ఈ సిగ్గుమాలిన వ్యక్తికి తగిన శాస్తి జరగాలి
అఖిల్ అక్కినేని కొండా సురేఖపై నిప్పులు చెరుగుతూ చేసిన తాజా పోస్ట్ వైరల్ గా మారింది. అందులో ‘కొండా సురేఖ ఇచ్చిన నిరాధారమైన ,హాస్యస్పదమైన స్టేట్మెంట్ అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉంది. పబ్లిక్ సర్వెంట్ గా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆవిడే సామాజిక సంక్షేమాన్ని, తన నైతికతను మరిచిపోయి ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిది. ఆమె వల్ల గౌరవనీయులైన సిటిజన్స్, హానెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ హార్ట్ అయ్యారు. వారిని కించపరిచారు. ఈ రాజకీయ యుద్ధంలో స్వార్థపూరితంగా గెలవాలని ప్రయత్నిస్తున్న ఆమె సిగ్గు లేకుండా తనకంటే చాలా ఉన్నతమైన విలువలు కలిగిన, సామాజిక అవగాహన ఉన్న అమాయక వ్యక్తులపై దాడి చేసి బలి పశువులను చేసింది. ఒక కుటుంబ సభ్యుడిగా, సినీ వర్గాల్లో మెంబర్ గా నేను దీనిపై మౌనంగా ఉండను. ఈ షేమ్ లెస్ వ్యక్తికి తగిన శాస్తి జరగాల్సిందే. ఆమె చేసిన తప్పుకు క్షమాపణ అనేదే లేదు, ఆమెలాంటి వ్యక్తులకు ఈ సమాజంలో క్షమాపణ, స్థానం లేదు’ అంటూ అఖిల్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
కేసు విచారణ వాయిదా
ఇక ఇప్పటికే అక్కినేని నాగార్జున తమ కుటుంబం పరువును దిగజార్చేలా కొండా సురేఖ ఆరోపణలు చేసింది అంటూ ఆమెపై పరువు నష్టం దావా వేశారు. అయితే నాంపల్లి కోర్టులో ఈ కేసు విచారణకు రాగా, న్యాయమూర్తి లీవ్ లో ఉన్న నేపథ్యంలో కేసు విచారణను వాయిదా వేశారు. ఈ కేసు సోమవారం రోజు న్యాయమూర్తి ముందు విచారణకు రానుంది. ఇక మరోవైపు కొండ సురేఖపై నెటిజెన్లు, అక్కినేని అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. కానీ ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. పైగా సమంత, నాగ చైతన్య ఎందుకు విడాకులు తీసుకున్నారు? అనే విషయంపై ఇప్పటిదాకా క్లారిటీ రాలేదని, ఇండస్ట్రి నుంచి దీని గురించి తనకు అందిన సమాచారం మేరకే తాను ఆ కామెంట్స్ చేశానని తనను తాను సమర్థించుకుని మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి బలయ్యింది. మరి ఈ వివాదంపై కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో, దానికి కొండా సురేఖ ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.