YS Jagan in Confusion: రాష్ట్రంలో వైసీపీకి జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జిలు లేక అనేక నియోజకవర్గాల్లో వైసీపీ అధిష్టానం ఇబ్బందులు పడుతోంది. వరుసగా జిల్లా సమీక్షలు నిర్వహిస్తున్న జగన్.. సరిపడా స్టామినా లేకపోయినా ఎవరినో ఒకరికి బాధ్యతలు అప్పగిస్తూ చేతులు దులుపుకోవాల్సి వస్తుంది. అలాంటి తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటి ఒక నియోజకవర్గంలో మాత్రం వైసీపీ ఇన్చార్జ్ పదవి కోసం నేతలు పోటీ పడుతుండటం విశేషం.. ఆ సెగ్మెంట్లో వైసీపీ ఇంత వరకు ఒక్కసారి కూడా గెలవలేదు అయినా అక్కడ వైసీపీలో మాత్రం పోటీ భారీగా ఉంది.
అమరావతి రాజధాని ప్రాంతంలో కీలక మైన నియోజకవర్గం గుంటూరు పశ్చిమ. అటువంటి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి పదవి కోసం పలువురు నాయకులు పోటీ పడుతున్నారు. నాకు కావాలి నాకే కావాలంటూ ఆరుగురు నేతలు రేసులో ఉండటం విశేషం.. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి మాజీమంత్రి విడుదల రజిని ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పల్నాడు జిల్లా సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబును గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా జగన్ నియమించారు. ఆ క్రమంలో గుంటూరు వెస్ట్పై ఫోకస్ పెట్టారు పలువురు నేతలు.. ఇంతవరకు వైసీపీ గెలవలేకపోయిన ఆ నియోజకవర్గమంటే ఒకవైపు భయపడుతున్నా.. ఆ నియోజకవర్గమే కావాలని వైసీపీ నేతలు పట్టుబడుతున్నారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పదవి కావాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మరో ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, గుంటూరు మేయర్ కవాటి మనోహర్ నాయుడు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, తాజాగా జిల్లా పార్టీ బాధ్యతలు స్వీకరించిన అంబటి రాంబాబు కూడా పార్టీ పెద్దలను కోరుతున్నారంట. దాంతో జగన్ ఏం చేయాలో తెలీక ఎవరికి ఇవ్వాళ అర్థం కాక తర్వాత చూద్దామంటూ కాలయాపన చేస్తున్నట్లు తెలిసింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలుగా ఎవరు పోటీ చేసినా రెండో సారి పోటీ చేసే అవకాశం దక్కలేదు.
Also Read: ఏపీలో మండుతున్న రాజకీయం.. టార్గెట్ భూమన?
ఆ సెగ్మెంట్లో పోటీ చేసిన నేతలు తర్వాత రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొందరికి అయితే రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయింది. 1989లో చదలవాడ రాంబాబు, 1994లో చల్లా వెంకటకృష్ణారెడ్డి.. 1999 లో శనక్కాల అరుణ, 2004లో తాడిసెట్టి వెంకట్రావు, 2009 కన్న లక్ష్మీనారాయణ, 2014లో మోదుగుల వేణుగోపాలరెడ్డి, 2019లో మద్దాలి గిరి లు పోటీ చేసి గెలుపొందారు.. వీరిలో ఒక్కరు కూడా తిరిగి అక్కడ నుంచి పోటీ చేయలేదు. మొన్నటి ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి షిఫ్ట్ అయి వచ్చిన మాజీ మంత్రి రజనీ రాజకీయ భవితవ్యం గుంటూరు వెస్ట్లో ఓడిపోయాక ప్రస్తుతం ప్రశ్నార్ధకంలో పడింది. అయినా ఇన్చార్జ్ పదవి కోసం వైసీపీ నేతలు పోటీ పడుతుండటం చర్చల్లో నలుగుతుంది.
మరి సదరు ఆశావహుల లెక్కలేంటో కాని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు వెస్ట్ వైసీపీలో కనిపిస్తున్న పోటీ జగన్ని గందరగోళంలోకి నెడుతుందంట. జిల్లా అధ్యక్షపదవి దక్కించుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా వెస్ట్ వైపు చూస్తుండటంతో జగన్ కన్ఫ్యూజన్ మరింత పెరిగిపోతుందట. పోటీ ఎక్కడ ఉన్నందుకు జగన్ ఆనందపడాలో.. ఇంతమంది ఆశావహులు.. ఇంతమంది ముఖ్యమైన నేతలు పోటీబట్టంతో బాధపడాలో తెలియక అధినేత అయోమయంలో పడ్డారు. పైగా రాజధాని ప్రాంతం టిడిపి కంచుకోట నియోజకవర్గం.