Suriya : తమిళ సినీ స్టార్ కపుల్ సూర్య-జ్యోతికలు పుత్రికోత్సాహంతో పొంగిపోతున్నారు. ఇటీవల కాలంలో స్టార్ కిడ్స్ రూటు మారుస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకులా తల్లిదండ్రులు పరిచిన బాటలో డైరెక్ట్ గా హీరోగానో, హీరోయిన్ గానో తెరపై ఎంట్రీ ఇస్తే సరిపోతుంది అనే రోజులు పోయాయి ఇప్పుడు. చాలామంది స్టార్ కిడ్స్ వెండితెరపై కాకుండా తెరవెనుక కూడా పని చేయడానికి ఇష్టపడుతున్నారు. అందులో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్ వంటి పనుల్లో ఆరితేరుతున్నారు. ముక్కు పచ్చలారకుండానే తమ టాలెంట్ తో అబ్బురపరిచి, పలు అవార్డులు వరించేలా చేసుకుంటున్నారు. ఆ లిస్ట్ లో తాజాగా సూర్య కూతురు దియా కూడా చెరిపోయింది.
డైరెక్టర్ గా మారిన కూతురు.. ఫస్ట్ మూవీతోనే అవార్డు
తమిళ చిత్రసీమలో అగ్రనటుడిగా ఎన్నో హిట్లు అందించిన నటుడు సూర్య. ఆయన కూతురు ఇప్పుడు చేసిన పనికి తండ్రికి తగ్గ తనయ అంటూ అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సూర్య-జ్యోతిక దంపతుల కుమార్తె దియా ‘లీడింగ్ లైట్- ది అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ బిహైండ్ ది సీన్స్’ అనే డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించింది. ఈ చిత్రం త్రిలోక ఇంటర్నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో బెస్ట్ స్టూడెంట్ షార్ట్గా గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఉత్తమ స్క్రీన్ రైటర్, స్పెషల్ జ్యూరీ అవార్డును దక్కించుకుంది. ఈ విషయాన్ని జ్యోతిక. సూర్య తమ సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ.. కూతురిని అభినందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వినోద పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష గురించి అర్థవంతమైన డాక్యుమెంటరీని రూపొందించినందుకు దియాను చూసి గర్విస్తున్నట్లు ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ‘ఈ ప్రాథమిక సమస్యను వెలుగులోకి తెచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ కూతురిని చూసి గర్వం వ్యక్తం చేసింది జ్యోతిక.
బిజీ కపుల్ సూర్య, జ్యోతిక
సూర్య హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’ త్వరలో విడుదల కానుంది. అలాగే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తన 44వ చిత్రంలో నటిస్తున్న సూర్య ఇటీవల విడుదలైన కార్తీ, అరవింద్ సామి నటించిన ‘మెయ్యళగన్’ (తెలుగులఓ సత్యం సుందరం) చిత్రాన్ని నిర్మించారు. ఇక సూర్యతో కలిసి ఎన్నో హిట్ సినిమాలలో నటించిన ఆయన భార్య, నటి జ్యోతిక కూడా ఒకవైపు సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటూనే హీరోయిన్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. పెళ్లి తర్వాత పాత్రలకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ వస్తోంది. ఈ దంపతులకు దేవ్, దియా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ముంబైలో స్థిరపడ్డ సూర్య
సూర్య, జ్యోతిక ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ రీసెంట్ గా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దానికి కారణం సూర్య ముంబైలో ఇల్లు తీసుకోవడమే. కానీ నిజం ఏంటంటే.. జ్యోతిక ఇప్పుడు హిందీ చిత్రాలపై దృష్టి పెడుతోంది. రీసెంట్ గా సైతాన్ మూవీతో జ్యోతిక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఇటీవలే సూర్య తన కుటుంబంతో ముంబైలో స్థిరపడ్డారు. మరోవైపు సూర్య పాన్ ఇండియా ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు.