Tdp and Ysrcp reaction: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎవరు సేఫ్? అధికార టీడీపీకి అనుకూలమా? వైసీపీకి అనుకూలమా? అధికార పార్టీ కంటే.. వైసీపీకి ఇబ్బందులు తప్పవనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు విచారణ సంస్థ ముందు మాజీ టీటీడీ ఛైర్మన్లు, మాజీ ఈవో రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న విషయంపై సీఎం చంద్రబాబు తర్జన భర్జన పడ్డారు. తొలుత డిపార్టుమెంట్ విచారణ ఆదేశించారు. అందులో నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. గుజరాత్ ల్యాబ్కు నెయ్యిని తరలించారు. అక్కడా జంతువుల కొవ్వు కలిసిందని తేలింది. సెప్టెంబర్ 18న కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చారు.
లడ్డూ వివాదంపై దేశవ్యాప్తంగా నిరసనలు ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు.. కేంద్రప్రభుత్వంతో మాట్లాడినట్టు అంతర్గత సమాచారం. తిరుమల లడ్డూ విషయాన్ని ఏం చేద్దామని అడిగారట. సీబీఐ ఎంక్వైరీ అయితే బాగుంటుందని సీఎం అన్నట్లు తెలుస్తోంది. తొలుత సిట్ వేసి దర్యాప్తు చేయించాలని సలహా ఇవ్వడంతో అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట కూటమి సర్కార్.
తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో అధికార టీడీపీ రియాక్ట్ అయ్యింది. లడ్డూ కల్తీపై వచ్చిన ఆరోపణలు చాలా సీరియస్ అంశమని టీడీపీ సోషల్ మీడియా విభాగం రాసుకొచ్చింది. ఈ లెక్కన జగన్, ఆయన టీమ్ పాపం పండినట్టేనని ప్రస్తావించింది.
ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సీబీఐ, ఏపీ పోలీసులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులతో కూడిన సిట్ను ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని తెలిపారు. సత్యమేవ జయతే.. ఓం నమో వేంకటేశాయ అని ఎక్స్లో రాసుకొచ్చారు.
ALSO READ: తిరుమల లడ్డూ వివాదం, సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్వతంత్ర దర్యాప్తు, కాకపోతే
వైసీపీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యింది. లడ్డూ వ్యవహారాన్ని సిట్తో చుట్టేయాలని చూసిన చంద్రబాబు సర్కార్కు సుప్రీంకోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందని పేర్కొంది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు పచ్చజెండా ఊపిందని తెలిపింది. సుప్రీంకోర్టు సిట్తో కూటమి ప్రభుత్వం బిక్కమొహం పెట్టుకుందని రాసుకొచ్చింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో టీటీడీ మాజీ ఛైర్మన్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై దర్యాప్తు లేకుండా చేస్తుందని తాము భావించామని, ఏపీ సిట్ పోయి.. దాని స్థానంలోకి సీబీఐ వచ్చిందని అంటున్నారు. ఈ లెక్కన విచారణకు తాము హాజరుకావాల్సిన అవసరం ఏర్పడిందన్నది ఆయా నేతల మాట.
లడ్డూ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్, ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఆయన ఎక్కడా సీబీఐ గానీ, న్యాయ విచారణ గానీ కోరలేదు. పైగా తమ ప్రభుత్వంలో కేంద్రానికి చెందినవారు టీటీడీ సభ్యులుగా ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారు. దీనిపై మాజీ సీఎం జగన్ మధ్యాహ్నం మీడియా ముందుకు రానున్నారు. ఆ సమావేశంలో ఆయన ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది.
I welcome the Honourable Supreme Court’s order of setting up SIT, comprising officers from CBI, AP Police and FSSAI to investigate the issue of adulteration of Tirupati laddu.
Satyamev Jayate.
Om Namo Venkatesaya.
— N Chandrababu Naidu (@ncbn) October 4, 2024