India Corona : చైనా సహా పలు దేశాల్లో కోవిడ్-19 మరోసారి సవాల్ విసురుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు ముమ్మరం చేసింది. ఇన్ఫెక్షన్లు పెరగకుండా నిరోధించేందుకు నిఘా పెట్టింది. అత్యవసర పరిస్థితుల్లో దీటుగా వ్యవహరించేందుకు సన్నాహాలు చేస్తోంది. మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.
క్రమబద్ధంగా, నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ రాసింది. కోవిడ్ నిరోధక మార్గదర్శకాలు ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రజల్ని కోరారు.
క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఈ మేరకు మన్సుఖ్ మాండవీయ ఓ ప్రకటన విడుదల చేశారు.
కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటనలో… రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేశారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంగ్ కాంగ్, థాయ్లాండ్ నుంచి వచ్చే వారికి తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయాలని చెప్పారు. కోవిడ్ లక్షణాలు కనిపించిన వారిని క్వారంటైన్కు పంపించాలని తెలిపారు.
భారత్ వచ్చే విదేశీయులు కోవిడ్ నెగెటివ్ టెస్ట్ రిపోర్టు కలిగి ఉండాలనే నిబంధన తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందన్న ప్రచారం అవాస్తవం అని తెలిపారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో 2 శాతం మంది నుంచి రాండమ్ శాంప్లింగ్ తీసుకుని పరీక్షలు చేయాలని మాండవీయ తెలిపింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం… భారత్లో రోజువారీ కోవిడ్-19 కేసుల సంఖ్య ప్రతీ వారం తగ్గుతోంది. అయితే శనివారం ఉదయం 8 గంటలకు విడుదల చేసిన బులెటిన్లో తెలిపిన వివరాల ప్రకారం.. రోజువారీ కేసుల సంఖ్య 201కి పెరగగా.. 3వేల 397 యాక్టివ్ కేసులు ఉన్నాయి.