– కొండకల్ తండాలో ఏం జరుగుతోంది?
– గిరిజనుల భూముల్లో అపర్ణ సంస్థ ఏం చేస్తోంది?
– అన్ని వివరాలతో విచారణకు రావాలి
– కలెక్టర్, పోలీసులు, ఎండోమెంట్, రెవెన్యూ అధికారులకు నోటీసులు
– అపర్ణ సంస్థకు కూడా పంపిన ఎస్టీ కమిషన్
– ‘‘ఊరంతా కబ్జా’’ పేరుతో ఆగస్టులో ‘స్వేచ్ఛ’ కథనాలు
– ‘స్వేచ్ఛ’ వార్తలతో గిరిజన రైతుల్లో పెరిగిన అవగాహన
– ఎస్టీ కమిషన్ రాకతో తమ బతుకులు మారతాయని ఆశాభావం
– ‘స్వేచ్ఛ’కు ప్రత్యేక ధన్యవాదాలు
– ఎస్టీ కమిషన్ ఎంట్రీతో వణికిపోతున్న విక్రమ్ రెడ్డి దొర, అపర్ణ సంస్థ
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: సామాన్యుడి స్వరం ‘స్వేచ్ఛ’. నిజాన్ని నిర్భయంగా చూపిస్తూ, ఎక్కడ ఏం జరిగినా ఇన్వెస్టిగేటివ్ కథనాలతో అతి తక్కువ సమయంలోనే ప్రజలకు చేరువ అయింది. సమస్య ఏదైనా, దాని వెను ఎవరున్నా ‘స్వేచ్ఛ’ న్యూస్ ఆగదు. ఎడిటోరియల్ పాలసీ మారదు. సామాన్యుడి పక్షాన నిలబడుతూ ముందుకు వెళ్తుంది. అవినీతిపరుల ఆట కట్టిస్తుంది. అలా, కొండకల్ తండాలో జరిగిన అతిపెద్ద భూ స్కామ్ను వెలుగులోకి తెచ్చింది ‘స్వేచ్ఛ’. ఆగస్ట్ 30, 31 తేదీల్లో ‘ఊరంతా కబ్జా.. రూ.17వేల కోట్ల స్కాం’ పేరుతో రెండు పార్టులుగా వరుస కథనాలను ప్రచురించింది. గ్రామంలో గిరిజన రైతులు పడుతున్న ఇబ్బందులను జనం ముందుకు తెచ్చింది. ‘స్వేచ్ఛ’ కథనాలతో స్థానికుల్లోనూ ధైర్యం పెరిగి, జాతీయ ఎస్టీ కమిషన్ వరకు వెళ్లారు. దీనిపై స్పందించిన కమిషన్ శనివారం విచారణ నిర్వహించబోతోంది.
Also Read: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. ఆ రైతన్నలకు రూ.500 బోనస్.. 48 గంటల్లో డబ్బు జమ
అసలీ స్కామ్ ఏంటి?
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలో ఉంటుంది కొండకల్ తండా. ఇక్కడి 352, 362, 363, 364, 377లోని భూములు రక్షిత కౌలుదారు(పీటీ) పరిధిలో ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా గిరిజన రైతులు వీటిని సాగు చేసుకుంటున్నారు. అయితే, స్థానికంగా ఉండే విక్రమ్ రెడ్డి దొర గ్రామ పెద్దగా చలామణీ అవుతున్నాడు. ఈయన అపర్ణ రియల్ ఎస్టేట్ సంస్థతో చేతులు కలిపి దొంగ పత్రాలు సృష్టించి గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న భూములను గుంజుకున్నాడు. దాదాపు 800 ఎకరాలను సదరు సంస్థ కబ్జా పెట్టింది. దీనికి స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారుల అండదండలు కూడా ఉన్నాయి. పైగా, బాధితులను బెదిరించి, అక్రమ కేసులు పెట్టించి వేధింపులకు గురి చేశారు.
బాధితుల బాధను వెలుగులోకి తెచ్చిన ‘స్వేచ్ఛ’
విక్రమ్ రెడ్డి దొర, అపర్ణ సంస్థతో ఎన్నాళ్ల నుంచో కొండకల్ తండావాసులు పడుతున్న ఇబ్బందులను బయటకు తీసుకొచ్చింది ‘స్వేచ్ఛ’. ఊరంతా కబ్జా పెట్టి సాగిస్తున్న దందాను, భారీ గోడల నిర్మానాలను, చెరువులు, స్మశానాన్ని చెరబట్టిన తీరును ఎండగట్టింది. పక్కా ఆధారాలతో కథనాలు ఇచ్చింది. అంతేకాదు, బాధితులపై పెట్టిన అక్రమ కేసుల వివరాలను కూడా ప్రచురించింది. రూ.17వేల కోట్ల స్కామ్ చుట్టూ జరుగుతున్న అక్రమ బాగోతాలను వెలుగులోకి తెచ్చింది. విక్రమ్ రెడ్డి దొర వ్యవహారాన్ని, అపర్ణ కంపెనీలో ఉదయ్ కుమార్ రెడ్డి కబ్జా తీరును వరుస కథనాలతో బయటి ప్రపంచానికి తెలియజేసింది.
‘స్వేచ్ఛ’ కథనాలతో బాధితుల్లో ధైర్యం
కొండకల్ తండాలో 80 శాతం మందికి చదువు రాదు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని విక్రమ్ రెడ్డి దొర, అపర్ణ సంస్థ సాగించిన దోపిడీని కళ్లకు కట్టినట్టు వివరించింది ‘స్వేచ్ఛ’. దీంతో బాధితుల్లో ధైర్యం పెరిగింది. ‘స్వేచ్ఛ’ కథనాలతో అవగాహన పెంచుకున్నారు తండా వాసులు. ఈ వ్యవహారంలో ఎంతవరకైనా వెళ్తామని డిసైడ్ అయి, లోకల్గా ఎన్ని ఫిర్యాదులు చేసినా పని జరగకపోవడంతో ఢిల్లీకి వెళ్లి ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు.
Also Read: ఆరునూరైనా అడ్డుకుని తీరుతా.. అవసరమైతే అక్కడికి కూడా వెళ్తా: హరీష్ రావు
రంగంలోకి జాతీయ ఎస్టీ కమిషన్
కొండకల్ తండా కబ్జా వ్యవహారాల గురించి ఆరా తీసిన జాతీయ ఎస్టీ కమిషన్, దీన్ని సీరియస్గా తీసుకుంది. శనివారం కొండకల్ తండాలో విచారణ ఉంటుందని స్పష్టం చేసింది. ప్రతివాదులు అందరికీ నోటీసులు పంపించింది. అపర్ణ కంపెనీతోపాటు అందులో భాగస్వాములకు, కలెక్టర్, పోలీసులు, ఎండోమెంట్, రెవెన్యూ అధికారులకు కూడా నోటీసులు ఇచ్చింది. తప్పకుండా విచారణకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. ఊరు కబ్జా చేసి తండా వాసులను ఇబ్బంది పెడుతున్న వైనంపై ఆరా తీయనుంది.
వణుకుతున్న విక్రమ్ రెడ్డి దొర, అపర్ణ సంస్థ.. ‘స్వేచ్ఛ’కు బాధితుల ధన్యవాదాలు
హైదరాబాద్కు దగ్గరలో ఉండే ప్రాంతంలో ఇంత దారుణమా అంటూ కమిషన్ సీరియస్ అవడంతో విక్రమ్ రెడ్డి దొర, అపర్ణ సంస్థ వెన్నులో వణుకు మొదలైంది. అంతా చేయిదాటిపోవడంతో గిరిజన రైతులకు సంబంధించిన భూముల్ని వారికే ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎక్కడి పనులు అక్కడే వదిలేసి, స్థానికులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని డిసైడ్ అయినట్టు సమాచారం. కమిషన్ ముందు హాజరై ఆదేశాల ప్రకారం ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, ‘స్వేచ్ఛ’ టీంకు ధన్యవాదాలు తెలిపారు బాధితులు. ‘స్వేచ్ఛ’ కథనాలతోనే తాము ధైర్యంగా ముందుకెళ్లామని స్పష్టం చేశారు.