Minister Sridharbabu Comments: మూసీ రివర్ ఫ్రంట్ సుందరీకరణ పథకం వల్ల పేదలు ఎవరూ నష్టపోకుండా చూస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. గురువారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తో కలిసి ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో 20 కి పైగా స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో అందరి అభిప్రాయాలను గౌరవిస్తామని తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసకోకుండా ఏకపక్షంగా వ్యవహరించవద్దని అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని శ్రీధర్ బాబు గుర్తు చేశారు. నగర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. అందులో భాగంగానే మూసీ రివర్ అభివృద్ధి చేయబోతున్నట్లు మంత్రి చెప్పారు.
Also Read: ఆరునూరైనా అడ్డుకుని తీరుతా.. అవసరమైతే అక్కడికి కూడా వెళ్తా: హరీష్ రావు
మూసీ నదీ గర్భంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి పునరావాసం కల్పిస్తామని, ఎవరినీ రోడ్ల పైకి పంపించే ప్రసక్తే లేదని మంత్రి పేర్కొన్నారు. తెలిసో తెలియకో కొంతకాలంగా వారంతా మురుగునీటి ప్రవాహం పక్కన నివాసాలు నిర్మించుకున్నారన్నారు. మూసీకి లక్ష క్యూసెక్కులకు పైగా భారీ వరద వచ్చినప్పుడు రివర్ బెడ్ లో ఉన్న ప్రజానీకానికి ప్రాణాపాయం, ఆస్తి నష్టం జరుగుతుందనేదే తమ ఆందోళన అన్నారు. బఫర్ జోన్ లో ఆక్రమణల తొలగింపు విషయంలో కూడా అందరి అభిప్రాయాలను సానుకూలంగా వింటామని మంత్రి తెలిపారు.
Also Read: నిఖత్ జరీన్ ప్రయాణం మనకు స్ఫూర్తిదాయకం: సీఎం రేవంత్
మూసీ నది పునరుజ్జీవనంతోపాటు రెండు వైపులా ఉన్న పురాతన ఆలయాలు, సంస్కృతి చిహ్నాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రి పేర్కొన్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు వల్ల నదీ పరివాహక ప్రాంతమంతా పర్యాటక కేంద్రంగా మారుతుందని శ్రీధర్ బాబు తెలిపారు. వేల మంది స్థానికులకు ఉపాధి దొరుకుతుందని వివరించారు. ఎవరు రెచ్చగొట్టినా, ప్రలోభ పెట్టాలని చూసినా అనవసర ఆవేశాలకు పోవద్దని మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు హితవు చెప్పారు. వారికి ఏ ఆపద వచ్చినా ఆదుకోవాల్సింది ప్రభుత్వమేనని, రాజకీయంగా వాడుకోవాలని చూసేవారి వల్ల నష్టపోవడం తప్ప ఎటువంటి ఒరిగేది ఏమీ ఉండదని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు రెచ్చగొడితే రెచ్చిపోవొద్దన్నారు. వాళ్లు రాజకీయాల కోసం వాడుకుంటారని సూచించారు. ప్రభుత్వానికి సహకరించాలంటూ ఈ సందర్భంగా మంత్రి కోరారు. సమావేశంలో తెలంగాణా వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ ఎం. కోదండరెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొ. హరగోపాల్, ప్రొ. శాంతాసిన్హా, సజయ, సంధ్య, బ్రదర్ వర్ఘీస్, మీరా సంఘమిత్ర, బిలాల్ తదితరులు పాల్గొన్నారు.