Work Pressure: కార్పొరేట్ ఉద్యోగాలు, లక్షల జీతాల గురించి వినేవారికి అదో గొప్పగా అనిపిస్తుంది గానీ, నిజానికి వారి జీవితాలు అత్యంత ఘోరంగా ఉన్నాయని పలు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆ ఉద్యోగులు తమ ప్రాజెక్టుల లక్షాలను నెరవేర్చడానికి ఎంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారో, చివరకు ఆత్మహత్యలకు కూడా పాల్పడేందుకు ఏ విధంగా తెగిస్తున్నారో తెలిస్తే తీరని ఆవేదన కలగకమానదు. 2021 లో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్సిఆర్బి) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పని ప్రదేశంలో ఒత్తిడి కారణంగా దేశం మొత్తం మీద ప్రతివారం కనీసం 50 మంది లెక్కన, మొత్తం 1,64,033 మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారని వెల్లడైంది. 2020తో పోలిస్తే ఈ మరణాల రేటు 7.2% అధికమని చెప్పవచ్చు. ఉద్యోగులు ఎందుకు ఈ తెగింపునకు పాల్పడుతున్నారో ఆయా సంస్థలు ఇప్పటికీ అర్థం చేసుకోకపోగా, అటు ప్రభుత్వాలూ ఈ అంశాన్ని పట్టించుకోవటం లేదు.
Also Read: తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి
ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవటంతో నేటి యువతకు నగరాల్లోని కార్పొరేట్ ఉద్యోగాలే దిక్కుగా మారాయి. కర్ణాటకలో ఇటీవల ఐటి కంపెనీలు ఉద్యోగులకు 14 నుంచి 18 గంటల వరకు పనివేళలు పెంచడం ఐటి రంగంలో కల్లోలం రేగిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి ఉద్యోగులు నిర్విరామంగా 18 గంటలు పని చేస్తేనే ఉత్పత్తి అధికంగా సాధించగలమని చెప్పటంపై దేశవ్యాప్తంగా యువత ఆయన మీద మండిపడ్డారు. మరోవైపు, యువతకు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తాం అని ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు మేడిపండు చందంగా ఉంటున్నాయి తప్ప వాస్తవానికి క్షేత్రస్థాయిలో అవి ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో లక్షల్లో తమకు వేతనాలు అందుతాయన్న ఆశతో బహుళ జాతి సంస్థలను ఆశ్రయించడం యువతకు తప్పనిసరి అవుతోంది. యువతకు అందమైన రంగుల హరివిల్లులో ఆకర్షిస్తున్న నగరాలే ఇప్పుడు యువతకు ఉరితాళ్లు బిగిస్తున్నాయని 2022లో ‘బిజినెస్ ఇన్సైడర్’ అనే వెబ్సైట్ వెల్లడించింది. దేశం లోని 53 నగరాల్లో నమోదైన మొత్తం ఆత్మహత్యల్లో నాలుగు ప్రధాన నగరాలైన ఢిల్లీ (2760), చెన్నై (2699), బెంగళూరు (2292), ముంబై (1436)లోనే 35.5 శాతం జరిగాయని ఆ వెబ్సైట్ విశ్లేషించడం గమనార్హం.
Also Read: 7 రోజులు దానిమ్మ తింటే ఏం జరుగుతుందో తెలుసా ?
2022 జనవరిలో 31 సంవత్సరాల ఐటి ఉద్యోగి పనిఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానంటూ తన కుటుంబ సభ్యులకు పదేపదే చెబుతూ వచ్చిన ఓ ఐటీ ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సంవత్సరం సెప్టెంబరులో గురుగ్రామ్లో 39 సంవత్సరాల అసిస్టెంట్ మేనేజర్ తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2021 లో హైదరాబాద్లోని టిసిఎస్లో పని చేస్తున్న యువకుడు పని ఒత్తిడి వల్లనే చనిపోయాడు. 2019లో 24 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన యువతి తాను పనిచేస్తున్న సంస్థ ఉద్యోగం నుంచి తొలగించడంతో హైదరాబాద్ రాయదుర్గంలోని ఓ హోటల్లో బలవన్మరణానికి బలైపోయింది. అదే సంవత్సరం 23 ఏళ్ల యువకుడు హైదరాబాద్లోని ఓ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీర్ఘకాల పని గంటలు, కష్టతరమైన డెడ్లైన్లు, అధిక పనిభారం ఇవన్నీ ఉద్యోగులపై విపరీతమైన ఒత్తిడికి దారితీస్తున్నాయి. మరోవైపు, కొందరు ఐటి ఉద్యోగులు వారాంతపు సెలవు రోజుల్లో కూడా తమతోపాటు లాప్టాప్ తీసుకెళ్లి ఇంటి దగ్గర పని చేయవలసిన పరిస్థితులు కూడా ఉంటున్నాయి. ఇలాంటి ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఆయా సంస్థలతో చర్చలు జరిపి, అక్కడ పరిస్థితులు మార్చేందుకు కాస్త చొరవ తీసుకోవాలి.