Mohanraj: ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ విలన్ మోహన్ రాజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. నేటి మధ్యాహ్నం 3 గంటలకు తిరువనంతపురం లోని కంజిరంకులం లో ఉన్న తన నివాసంలో ఆయన మృతి చెందారు. ఈ విషయాన్నీ మలయాళ నటుడు మరియు దర్శకుడు అయిన దినేష్ పనికర్.. ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. దీంతో మలయాళ ఇండస్ట్రీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తుంది.
మోహన్ రాజ్.. ఒక మలయాళ నటుడు. విలన్ పాత్రల్లో ఎంతో గుర్తింపును తెచ్చుకున్నారు. మోహన్ రాజ్.. సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మోహన్రాజ్ 1988లో ‘మూనం మురా’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా తరువాత ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించిన మోహన్ రాజ్.. లైఫ్ ను మార్చేసిన సినిమా కిరీడం. డైరెక్టర్ సీబీ మలయిల్.. మోహన్ రాజ్ ముఖంలో ఉన్న విలనిజాన్ని చూసి.. కీరికదన్ జోస్ అనే పాత్రను రాశారట. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
అప్పటినుంచి మోహన్ రాజ్ ను.. మలయాళ ఇండస్ట్రీ కీరికదన్ జోస్ గానే గుర్తుపెట్టుకుంది. ఇక ఆ తరువాత ఆయన వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. మలయాళ, తమిళ్, తెలుగు భాషల్లో మొత్తం 300 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగులో స్టార్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల్లో విలనిజాన్ని చూపించి అప్పట్లో స్టార్ విలన్ గా పేరు తెచ్చుకున్నారు.
స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్, పోకిరి రాజా, రౌడీ ఇన్స్పెక్టర్, అసెంబ్లీ రౌడీ.. లారీ డ్రైవర్, చినరాయుడు, శివమణి, శివయ్య, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు లాంటి సినిమాల్లో నటించారు. ఇక చివరిగా మోహన్ రాజ్.. మమ్ముట్టి నటించిన రోర్స్చాచ్ అనే చిత్రంలో కనిపించారు. అవ్వడానికి మలయాళ నటుడు అయినా.. అందరు ఆయనను టాలీవుడ్ నటుడిగానే చూస్తారు.
సినిమాలకు దూరమైనా మోహన్ రాజ్.. మధురైలో ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషన్గా విధులు నిర్వహించేవారు. సినిమాలకు దూరంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తన భార్య బిడ్డలతో ఎంతో సంతోషంగా గడుపుతున్న ఆయన గత మూడేళ్లుగా అరుదైన వ్యాధితో పోరాడుతున్నారని తెలుస్తోంది.సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆయన అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో కనిపిస్తూ ఉండేవారు.
ఇక మోహన్ రాజ్ అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మోహన్ రాజ్ మరణ వార్త విన్న ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలుపుతున్నారు. మోహన్ రాజ్ కు భార్య ఉష, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.