Corona: కరోనా మళ్లీ వచ్చేసింది. కొత్త వేరియంట్ తో పంజా విసిరేందుకు రెడీగా ఉంది. ముందుగా కేంద్రం అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. వ్యాక్సిన్లు, ఆసుపత్రి బెడ్లు సిద్ధం చేసుకోమని తెలిపింది. ప్రభుత్వ యంత్రాంగమే కాదు.. తానుసైతం సిద్ధం అంటూ ప్రకటించారు కరోనా స్టార్ సోనూ సూద్.
సోనూసూద్. ఈ పేరు తెలీని వారుండరు. కరోనా కాలంలో రియల్ హీరోగా నిలిచారు. ప్రభుత్వాలకంటే వేగంగా స్పందించారు. మందులు, ఆక్సిజన్ సిలిండర్లు, ఇంజెక్షన్లు, బస్సులు, విమాన టికెట్లు.. ఏది కావాలంటే అది. అడిగిన వెంటనే జెట్ స్పీడ్ తో అరేంజ్ చేసి సర్కారుకే సవాల్ చేశారు. వలస కూలీలకు ఆయనో దేవుడు. లాక్ డౌన్ విధించేసి కేంద్రం చేతులెత్తేయగా.. కాలి నడకన స్వగ్రామాల బాట పట్టిన వేలాది వలస కూలీల అవస్థలు చూడ్లేక పోయారు. వారి కోసం వందలాది బస్సులు అరేంజ్ చేసి సొంతూళ్లకు చేర్చారు. విమాన టికెట్లు, ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వాలు చేయలేని పనులెన్నో చేసి చూపించారు. అందుకే, సోనూసూద్ కరోనా కాలపు దేవుడు..అంటారు.
అలాంటి సోనూసూద్ మళ్లీ ప్రత్యక్షమయ్యారు. కరోనా కొత్త వేరియంట్ తో విరుచుకుపడుతోందనే వార్తలు వచ్చీ రాగానే.. తానున్నానంటూ.. మళ్లీ సేవకు సై అంటూ ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. “కరోనాతో జాగ్రత్తగా ఉండండి.. భయం వద్దు.. ఈసారి నా అవసరం రావొద్దనే కోరుకుంటున్నా.. ఒకవేళ వస్తే, గుర్తు చేసుకోండి.. నెంబర్ అదే”.. అంటూ ట్వీట్ చేశారు సోనూసూద్.