Bengaluru News: కొపంలో ఉన్నప్పుడు మనిషి ఎంత దారుణంగా ప్రవర్తిస్తాడో చెప్పడానికి ఇదో బెస్ట్ ఎగ్జాంఫుల్. ఉన్న ఉద్యోగం పోయింది. కొత్త ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. అయినా దొరకలేదు. కాళ్ల చెప్పులు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అయినా, తనను ఎవరూ ఉద్యోగం లోకి తీసుకోవడం లేదు. తన మీద తనకే అసహ్యం వేసింది. తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. అదే కోపం ఓ వ్యక్తి మీద చూపించాడు. కత్తితో పొడిచి నానా రచ్చ చేశాడు. కోపం నేరంగా మారి కటకటాల్లోకి వెళ్లేలా చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
కండక్టర్ ను కత్తితో పొడిచిన యువకుడు
జార్ఖండ్ కు చెందిన 32 ఏండ్ల హర్ష సిన్హా.. గత కొంతకాలంగా బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. జీవితం సాఫీగా గడిచిపోతుంది అనుకుంటున్న సమయంలో అనుకోని పిడుగు పడింది. తనను ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్లు కంపెనీ చెప్పింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సిన్హాలో ఆందోళన మొదలయ్యింది. కొత్త ఉద్యోగం కోసం గత కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నాడు. చాలా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు. ఉద్యోగం కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎప్పటి లాగే ఉద్యోగం కోసం బస్సులో బయల్దేరాడు. డోర్ దగ్గర నిలబడ్డాడు. ముందు నుంచి టిక్కెట్లు కొట్టుకుంటూ కండక్టర్ సిన్హా దగ్గరికి వచ్చాడు. అతడు కూడా టిక్కెట్ తీసుకున్నాడు. డోర్ కు దూరంగా ఉండాలని కండక్టర్ ఆయనకు చెప్పాడు. సిన్హా ఎటో ఆలోచిస్తూ సరే అన్నాడు. మరోసారి కండక్టర్ ముందుకు వెళ్లి వెనక్కి వచ్చాడు. అప్పటికీ సిన్హా డోర్ దగ్గరే ఉన్నాడు. దీంతో ఆయనపై అరిచాడు కండక్టర్. దిగేవారికి ఇబ్బంది లేకుండానే నిలబడ్డానని సిహ్హ చెప్పాడు. అయినప్పటికీ కండక్టర్ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించడంతో, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటికే ఉద్యోగం లేదనే ఫ్రస్టేషన్ లో ఉన్న సిన్హా వెంటనే బ్యాగ్ ఓపెన్ చేసి అందులో నుంచి ఓ కత్తి తీసి పోటు మీద పోటు మూడు పోట్లు పొడిచాడు. తోటి ప్రయాణీకులు భయంతో బయటకు పరుగులు తీశారు. సిన్హా మాత్రం బస్సులోనే ఉన్నాడు. కోపం తట్టుకోలేక బస్సు అద్దాలను కాళ్లతో తన్నుతూ పగలగొట్టాడు.
సిన్హాపై హత్యాయత్నం కేసు, కండక్టర్ సేఫ్..
ప్రయాణీకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకుని సిన్హాను అరెస్టు చేశారు. ఉద్యోగం లేదనే కోపంలోనే ఈ దారుణానికి పాల్పడినట్లు సిన్హా పోలీసుల ముందు నేరం అంగీకరించారు. అతడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సిన్హా కత్తి పోటుకు గురైన కండక్టర్ యోగేష్ కు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మూడు సాధారణ కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వెల్లడించారు. కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. సిన్హా బస్సులో చేసిన రచ్చకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: ‘ఇంత బతుకు బతికి చివరికి ఈ పని చేయాలా!’.. వైరల్ అవుతున్నరిటైర్డ్ అధికారి ఫన్నీ పోస్ట్