MP Mallu Ravi: మంత్రి కొండా సురేఖ-కేటీఆర్ కామెంట్ల వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో నాగార్జున ఫ్యామిలీ రియాక్ట్ అయ్యింది. ఓ అడుగు ముందుకేసిన నాగార్జున భార్య అమల, రాహుల్గాంధీని లాగారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి రియాక్ట్ అయ్యారు.
రాజకీయ నాయకులందరిపై అక్కినేని అమల చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు ఎంపీ మల్లు రవి. రాహుల్గాంధీ మానవత్వం గురించి మాట్లాడటం చాలా బాధాకరమని, ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మంత్రి కొండా సురేఖపై సోషల్మీడియాలో దారుణమైన పోస్టులు పెట్టడంతో ఆమె స్పందించారని గుర్తు చేశారు. దీనిపై బీఆర్ఎస్ మహిళా నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారాయన. ఇప్పుడు మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీ మంత్రి అయిన కొండా సురేఖ తన ఆత్మగౌరవం కాపాడేందుకు రియాక్ట్ అయ్యారని వివరించారు. దీనికి మూల కారణం ఏంటో తెలుసుకుని ప్రతీ ఒక్కరూ మాట్లాడాలన్నారు.
ఇంతకీ అమల ఏమన్నారు? రాహుల్గాంధీ గారూ… మీరు మానవత్వం, మర్యాదలను నమ్మితే మీ రాజకీయ నేతలను అదుపులో ఉంచుకోవాలన్నారు. మీ మంత్రి మా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి చేసిన విష పూరిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇలాంటివారి నుంచి దేశ పౌరులను రక్షించాలని ఎక్స్ లో ప్రస్తావించారు.
ALSO READ: చిన్నచూపు చూడొద్దు, రాజకీయ గొడవల్లోకి లాగొద్దు.. కొండా సురేఖ వ్యాఖ్యలకు సమంత కౌంటర్
మంత్రి కొండా సురేఖ-కేటీఆర్ వ్యవహారానికి సోషల్మీడియా వేదికైంది. మంత్రిపై కక్ష గట్టిన కొందరు పదే పదే రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదంతా దుబాయ్ వేదికగా జరిగిందంటూ ప్రస్తావించారు మంత్రి కొండా సురేఖ. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.