Covid: కొత్త వేరియంట్ పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వ్యాక్సిన్లు, ఆక్సిజన్ బెడ్లు రెడీ చేసుకోమని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి అనే నిబంధన తీసుకొచ్చింది. ఇవి చాలవు.. అంతకుమించి చర్యలకు తాజాగా శ్రీకారం చుట్టింది కేంద్రం.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో ర్యాండమ్ కరోనా టెస్టులను ప్రారంభించింది. శనివారం ఉదయం నుంచి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్ తదితర విమానాశ్రయాల్లో ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. ప్రయాణికులందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు.
ఇక ర్యాండమ్ కొవిడ్ టెస్టులు అందరికీ చేయరు. విదేశాల నుంచి వచ్చే ప్రతి విమానంలో 2 శాతం ప్రయాణికులను ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తారు. ఎంపిక చేసిన ప్రయాణికులను విమానాశ్రయాల్లోని కొవిడ్ పరీక్షా కేంద్రాల్లో టెస్టులు చేస్తారు. ఆ పరీక్షల్లో ఎవరికైనా ‘పాజిటివ్’ అని రిపోర్ట్ వస్తే.. తదుపరి చర్యలకుగాను ఆ సమాచారాన్ని సంబంధిత రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిస్తారు. ఇదీ ప్రొసిజర్.
అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకే ధరకు కొవిడ్ టెస్టులు చేస్తారు. ఖర్చులను కేంద్ర వైద్యారోగ్యశాఖ తిరిగి చెల్లిస్తుంది. ప్రయాణికుల్లో ఎవరికి టెస్టులు నిర్వహించాలన్నది సంబంధిత విమానయాన సంస్థలు గుర్తిస్తాయి.
మరోవైపు, చైనా, జపాన్, కొరియా, హాంకాంగ్, థాయ్ లాండ్ నుంచి వచ్చే ప్రమాణికులు అందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి చేసింది కేంద్రం. వారిలో ఎవరికైనా కొవిడ్ పాజిటివ్ వస్తే.. వారిని వెంటనే ఐసోలేషన్ కు తరలించనున్నారు. విదేశీ ప్యాసింజర్ల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఎయిర్ సువిధ ఫారం నింపడాన్ని కంపల్సరీ చేసింది కేంద్ర ప్రభుత్వం.