– కాకతీయ వర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
– స్వేచ్ఛ కథనంతో ఉన్నతాధికారుల ఆరా
– వర్సిటీ భూమిలో ఇల్లు కట్టుకున్న అశోక్ బాబు
– సర్వే చేసిన విజిలెన్స్, రెవెన్యూ, కేయూ అధికారులు
– ఫిజికల్ సర్వేలో బయటపడిన అసలు నిజం
– అది కూడా తప్పు అంటూ బుకాయింపు
– ఇంఛార్జ్ వీసీ వాకాటి కరుణ ఆగ్రహం
– సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన రిజిస్ట్రార్
– ‘స్వేచ్ఛ’కు ధన్యవాదాలు తెలిపిన విద్యార్థులు
సతీష్ పబ్బు, స్వేచ్ఛ వరంగల్ ఇన్వెస్టిగేషన్ టీం
వరంగల్, స్వేచ్ఛ: సంచలన కథనాలకు వేదిక స్వేచ్ఛ. అనతి కాలంలోనే తెలంగాణ ప్రజానీకానికి చేరువై, రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా, దాని వెనుక ఉన్న అసలు నిజాలను బయటకు తీస్తూ, ప్రజలకు వివరిస్తూ, ఇన్వెస్టిగేటివ్ కథనాలను అందిస్తోంది. కబ్జాలు, కరెప్షన్ లీడర్లు, అధికారుల గుట్టంతా బయటపెడుతోంది. ఈ క్రమంలోనే జులై 17న ‘ప్రహర్రీ వర్రీ’ పేరుతో కాకతీయ యూనివర్సిటీ భూముల్లో జరిగిన కబ్జాలకు సంబంధించిన సంచలన కథనాన్ని ఇచ్చింది. అందులో భాగంగా దొంగ చేతికే తాళం అంటూ వర్సిటీలో పనిచేసే వారే కబ్జాలకు పాల్పడిన తీరును జనం ముందు ఉంచింది. దీంతో వర్సిటీ అధికారుల్లో, వరంగల్ ప్రజల్లో స్వేచ్ఛ కథనం చర్చనీయాంశమైంది. విచారణ జరపగా, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్ బాబుపై చివరకు సస్పెన్షన్ వేటు పడింది.
Also Read: కేటీఆర్.. నువ్వు మగాడివైతే.. రెచ్చిపోయిన సీతక్క
కేయూ భూముల్లో కబ్జాలెన్నో!
ఎందరో మేధావులను అందించిన కాకతీయ యూనివర్సిటీ భూముల్లో కబ్జాకోరులు కోరలు చాస్తూ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 200 ఎకరాలు కబ్జాకు గురయ్యాయంటే అర్థం చేసుకోండి. లష్కర్ సింగారం, పల్లివెల్పుల, కుమార్ పల్లి, శివ నగర్లోని పలు సర్వే నెంబర్లలో 600 ఎకరాలకు పైగా భూమి ఉండగా, 400 ఎకరాల వరకే మిగిలింది. మిగిలినదంతా కబ్జాకు గురైంది. ఆఖరికి వర్సిటీలో పని చేసే వారు కూడా కబ్జాలకు పాల్పడడం చర్చనీయాంశం అయి, మున్సిపల్ అధికారుల దాకా వెళ్లింది. మూడేళ్ల క్రితం 13 మంది వర్సిటీ భూముల్ని ఆక్రమించారని తేల్చారు. వారిలో ముగ్గురు కేయూ ఉద్యోగులు ఉన్నారు. అందులో ఒక్కరే అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్ బాబు. విచిత్రం ఏంటంటే, అప్పటి వీసీ భూ సర్వే కోసం కమిటీ వేయగా, అందులో ఈయన కూడా సభ్యుడిగా ఉన్నాడు. కబ్జా ఆరోపణలు ఉన్న వ్యక్తిని సభ్యుడిగా చేర్చడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. విద్యార్థుల ఆందోళనలతో వెనక్కి తగ్గి అశోక్ బాబును చివరకు కమిటీ నుంచి తప్పించారు.
ఎట్టకేలకు చర్యలు
గత వీసీ రమేష్, బీఆర్ఎస్ నేతల అండదండలతో రెచ్చిపోయిన అశోక్ బాబుకు కొన్నాళ్లుగా కష్టకాలం మొదలైంది. ఆయన చేసిన కబ్జాపై వర్సిటీ అధికారులు ఫోకస్ చేయడంతో అడ్డంగా దొరికిపోయాడు. కబ్జాకు పాల్పడినట్టు నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రిజిస్ట్రార్ మల్లారెడ్డి. వర్సిటీ భూములు ఆక్రమించి దర్జాగా ఇల్లు కట్టుకున్నాడు అశోక్ బాబు. దీనిపై తాజాగా ఫిజికల్ సర్వే నిర్వహించారు విజిలెన్స్, రెవెన్యూ, కేయూ అధికారులు. కుమార్ పల్లి శివారులో సర్వే నెంబర్ 229లోనే ఇతని ఇల్లు ఉందని నిర్ధారణ అయింది. కానీ, తాను యూనివర్సిటీ బయట సర్వే నెంబర్ 235లో ఇల్లు కట్టుకున్నానంటూ బుకాయిస్తూ వచ్చాడు అశోక్ బాబు. అయితే, విజిలెన్స్ సర్వేలో అతని బండారం బయటపడింది. పైగా, సర్వేను తప్పుపడుతూ ఇటీవల సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. వర్సిటీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నాడన్న కారణంతో కొద్ది రోజుల కిందట మెమో జారీ చేశారు రిజిస్ట్రార్. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అశోక్ బాబు వివరణపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఇంఛార్జ్ వీసీ వాకాటి కరుణ. సస్పెండ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడంతో ఉత్తర్వులు జారీ చేశారు రిజిస్ట్రార్.
Also Read: అప్పుడు ఆయన బెదిరించాడు.. ఇప్పుడు ఈయన బెదిరిస్తున్నాడు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఇంచు భూమి కూడా వదలమన్న రిజిస్ట్రార్
వర్సిటీ భూములకు సంబంధించి రిజిస్ట్రార్ మల్లారెడ్డి గతంలోనే ‘స్వేచ్ఛ’తో మాట్లాడారు. కేయూ భూముల పరిరక్షణ విషయంలో ఇంచార్జ్ వీసీ కరుణ పట్టుదలతో ఉన్నారని తెలిపారు. భూములపై సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తున్నట్టు చెప్పారు. అలాగే, వివాదాస్పద ప్రహరీ నిర్మాణంపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వర్సిటీ భూముల్ని ఎవరు కబ్జా చేసినా వదిలేది లేదని హెచ్చరించారు.