Mayor: అసలే జీహెచ్ఎమ్సీలో విపక్షాల సంఖ్యా బలం ఎక్కువ. పైగా అధికారపార్టీకి ఎప్పుడెప్పుడు చుక్కులు చూపిద్దామా అనే ఆరాటం. వెరసి, GHMC సర్వసభ్య సమావేశం జరిగినప్పుడల్లా రచ్చ రచ్చ. లేటెస్ట్ గా మరోసారి, కౌన్సిల్ మీటింగ్ లో గొడవ జరిగింది. మేయర్ వర్సెస్ అపోజిషన్.. ఉద్రిక్తంగా మారింది.
సభ ప్రారంభానికి ముందే బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్లకార్డులతో నిరసనకు దిగారు. మేయర్ వచ్చాక మరింత రెచ్చిపోయారు. పోడియంను ముట్టడించి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. రెండు సార్లు వాయిదా పడగా.. ఆ గందరగోళంలోనే వార్షిక బడ్జెట్ ఆమోదించడం జరిగిపోయింది.
2023-2024 వార్షిక బడ్జెట్ కు జీహెచ్ఎంసీ ఆమోదం తెలిపింది. సభ్యులతో చర్చించకుండా బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. విపక్ష సభ్యులు మేయర్ పోడియం చుట్టూ చేరి నిరసన వ్యక్తం చేశారు. సభ్యుల నిరసనల మధ్యే 6,224 కోట్ల వార్షిక బడ్జెట్ ను ఆమోదించారు మేయర్.
అనంతరం సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభం అయినప్పటికీ ఎటువంటి మార్పు లేదు. హైదరాబాద్ మహానగరంలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించాలంటూ బీజేపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని.. మేయర్ పోడియం ముందు ఆందోళనకు దిగారు.
బీజేపీ కార్పొరేటర్ల తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ప్రతిపక్ష సభ్యుల తీరుపై మేయర్ విజయలక్ష్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.