Kaikala: వెండితెర యముడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన భౌతిక రూపం కనుమరుగైంది. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ప్రభుత్వ లాంఛనాల ప్రకారం పోలీసులు గన్ సెల్యూట్ సమర్పించారు. కైకాల కుమారుడు.. తండ్రి చితికి నిప్పంటించారు. అలా, 87 ఏళ్ల ఆ సినీ సార్వభౌముడు అగ్నిలో కలిసిపోయారు.
700కు పైగా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన కైకాల సత్యనారాయణ.. అనారోగ్య సమస్యలపై శుక్రవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణ మరణంపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ కైకాల నటనను కొనియాడారు. సీఎం కేసీఆర్ కైకాల కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్థీవ దేహానికి అనేక మంది నివాళులు అర్పించారు.
శనివారం కైకాల ఇంటి నుంచి మహాప్రస్థానం వరకు.. అంతిమయాత్ర కొనసాగింది. అంతిమయాత్రకూ చాలామంది అభిమానులు, ప్రముఖులు తరలివచ్చారు. తెలంగాణ సర్కార్ ప్రభుత్వ లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలను నిర్వహించింది.
అలా, టాలీవుడ్ నవరస నటనా సౌర్వభౌముడు ఇక భౌతికంగా దూరమయ్యారు. తన సినిమాలతో శాశ్వతంగా మనతోనే ఉండనున్నారు.