MP Raghunandan Rao Comments on BRS Social Media Trolling: సోషల్ మీడియాలో తనపై అసభ్యకరంగా, అవమానకరంగా పోస్టులు పెడుతూ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారంటూ మంత్రి కొండా సురేఖ కంటతడి పెట్టిన విషయం తెలిసిందే. ఈ విధంగా ట్రోలింగ్ చేస్తున్న బీఆర్ఎస్ ను వదలబోమన్నారు. ఖచ్చితంగా తగిన పాఠం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కావాలనే ఇలా టార్గెట్ చేస్తూ పోస్టింగ్ లు పెట్టారన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా కేటీఆర్, కేసీఆర్.. మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా..? ఆ పోస్టులను మీ ఇంట్లో వాళ్లకు చూపించు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదేవిధంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా స్పందించారు. ఆ విధంగా ట్రోల్ చేస్తున్నవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలబోనన్నారు. మంత్రి కొండా సురేఖకు జరిగిన అవమానాన్ని తాను ఖండిస్తున్నానన్నారు. దీనిపై ఒక తమ్ముడిగా కోర్టుకు వెళ్తానన్నారు. ట్రోలింగ్ చేసేవాళ్లపై కఠిన చర్యలు తీసుకునేలా చేస్తానన్నారు. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
Also Read: ఆ హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారు.. మంత్రి కొండా సురేఖ కామెంట్స్
ఈ క్రమంలో బుధవారం కేటీఆర్ కూడా స్పందించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ఆయన పేర్కొన్నారు. మాట్లాడేముందు మీరు గతంలో మాట్లాడిన బూతు మాటలను ఒకసారి గుర్తు చేసుకోండి అంటూ కొండా సురేఖకు కేటీఆర్ సూచించారు. మీరు మాట్లాడినప్పుడు మా ఇంట్లో ఆడవాళ్లు లేరా..? వాళ్లకు మనసు లేదా..? వాళ్లు కూడా బాధపడలేదా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కొండా సురేఖ మాట్లాడిన బూతులకు సంబంధించిన వీడియోలను మీకు పంపిస్తాను.. వాటిని చూసి మీరు ఏం సమాధానం చెబుతారో చెప్పండి అంటూ ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. నోరు తెరిస్తే చాలు బూతులు తప్ప ఒక్క మంచి మాట కూడా రావడంలేదన్నారు. సమాజానికి మీరిచ్చే మెసేజ్ ఇదేనా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా రెడ్డి కూడా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. కొండా సురేఖ మీరు చేసిన ఆరోపణల వల్ల కేటీఆర్ వాళ్ల అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా..? వాళ్లు కూడా ఆడవాళ్లే కదా? అని పేర్కొంటూ కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు ఆదర్శనీయంగా ఉండాలి కానీ, ఇలా ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్నారు.
Also Read: మీ వ్యాఖ్యలతో కేటీఆర్ ఇంటొళ్లు బాధపడరా..? వాళ్లు ఆడబిడ్డలు కారా..? : కొండా సురేఖపై సబిత సీరియస్
ఇదిలా ఉంటే.. తాజాగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మరోసారి స్పందించారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టినవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలబోనన్నారు. మహిళలను అవమానించేలా పోస్టులు పెడితే ఊరుకోబోనంటూ ఎంపీ హెచ్చరించారు. సంగారెడ్డిలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా ట్రోలింగ్ విషయమై ఫైరయ్యారు.