Rahul Gandhi: భారత్ జోడో యాత్ర కీలక ప్రాంతానికి చేరింది. రాహుల్ గాంధీ పాదయాత్ర ఢిల్లీలో అడుగుపెట్టింది. సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ వెంటరాగా.. కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి నడవగా.. దేశ రాజధానిలోకి రాహుల్ గాంధీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. జై కాంగ్రెస్ నినాదాలు.. మూడు రంగుల పార్టీ జెండాలతో ఢిల్లీ వీధుల్లో కాంగ్రెస్ కదం తొక్కింది.
అయితే, రాహుల్ గాంధీ యాత్రపై కరోనా పంజా పడేలా ఉందంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే హెచ్చరించింది. కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని.. లేదంటే జోడో యాత్ర నిలిపివేయాలని ఇప్పటికే రాహుల్ కు లేఖ రాసింది. రాహుల్ గాంధీ పాదయాత్రను అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని.. కరోనా సాకుతో కావాలనే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందని.. జోడో యాత్రకు లభిస్తోన్న ఆదరణ చూసి బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. యాత్రను ఆపేదే లేదంటూ ముందుముందుకు సాగుతోంది.
అటు, ఢిల్లీలో ఎంటర్ అయిన రాహుల్ గాంధీ సైతం కేంద్రం తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కొత్త వేరియంట్ కలవరం ఉండగానే బీజేపీ పలు రాష్ట్రాల్లో యాత్రలు చేపడుతోంది.. కానీ, ఆరోగ్య శాఖ మాత్రం యాత్ర ఆపాలంటూ తనకు లేఖలు పంపుతోందని మండిపడ్డారు. ద్వేషం అనే బజార్లో ప్రేమ దుకాణాలను తెరిచేందుకే తాను యాత్ర చేస్తున్నానని ఆర్ఎస్ఎస్, బీజేపీ వ్యక్తులకు తేల్చి చెప్పారు రాహుల్ గాంధీ.