Bank Theft: దొంగలు తెలివి మీరుతున్నారు. కాస్త కష్టమైనా.. పర్ ఫెక్ట్ గా చోరీలకు పాల్పడుతున్నారు. గేటు దూకడాలు.. తాళాలు పగలగొట్టడాలు కామన్ అనుకున్నారో ఏమో.. ఈసారి ఇంకాస్త వెరైటీగా ఆలోచించారు. ఏకంగా బ్యాంకు స్ట్రాంగ్రూంలోకి సొరంగం తవ్వి.. భారీ లూటీ చేశారు కేటుగాళ్లు.
జైలు నుంచి తప్పించుకోవడానికి ఖైదీలు సొరంగం తవ్వడం చూశాం. దొంగలు గోడకు రంధ్రం చేసిన ఘటనలూ అనేకం. కానీ, కాన్పూర్ లోని దొంగలు ఏకంగా బయటి నుంచి బ్యాంకు లాకర్ల కింది వరకూ సొరంగం తవ్వేశారు. ఎస్బీఐ భనుతి శాఖ బిల్డింగ్ లో పక్కనే ఉన్న ఖాళీ స్థలం నుంచి బ్యాంకు స్ట్రాంగ్ రూంలోకి 10 అడుగుల మేర సొరంగం తవ్వి లోపలికి జొరబడ్డారు దొంగలు. లాకర్ పగలగొట్టి.. అందులోని 1.8 కేజీల బంగారం దొంగిలించారు. మరో లాకర్ లో ఉన్న 32 లక్షలు దోచుకోడానికి ప్రయత్నించినా.. ఆ లాకర్ ను బ్రేక్ చేయలేకపోయారు.
మర్నాడు ఎప్పటిలానే బ్యాంకు తెరిచారు ఉద్యోగులు. సొరంగం చూసి ఉలిక్కిపడ్డారు. దొంగతనం జరిగిందని నిర్థారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేలి ముద్రలు, ఇతర ఆధారాల ద్వారా దొంగలను గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకు నిర్మాణం బాగా తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.