AP: అతనో సిన్సియర్ ఆఫీసర్. రూల్స్ ప్రకారం మాట్లాడారు. అధికార పార్టీ అయినా సరే.. రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్..అన్నారు. అది కూడా అందరిముందు. ఏకంగా మంత్రినే తప్పుబట్టారు. అక్కడితో ఆగలేదు ఆ అధికారి. మరింత స్ట్రిక్ట్ గా డ్యూటీ చేశారు. రూల్స్ అతిక్రమించడంపై పోలీసులు, రెవెన్యూ అధికారులకు సైతం కంప్లైంట్ ఇచ్చారు. అంతటి సిన్సియర్ ఆఫీసర్ ను ఎక్కడా చూడలేదని ప్రజలు అప్రిషియేట్ చేశారు. కానీ, ఈ పరిణామం అధికార పార్టీని తీవ్ర అవమానానికి గురి చేసింది. కట్ చేస్తే.. ఎప్పటిలానే ఆ ఆఫీసర్ పై బదిలీ వేటు పడింది. సినిమాటిక్ గా జరిగిన ఆ సంఘటన బాపట్లలో జరిగింది.
వైసీపీ కార్యాలయానికి ఆర్టీసీ స్థలాన్ని కేటాయించడంపై బాపట్ల డిపో మేనేజర్ శ్రీనివాసరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఆయనపై చర్యలు తీసుకున్నారు. వెంటనే కేంద్ర కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
ఇటీవల వైసీపీ కార్యాలయం శంకుస్థాపన సమయంలో మంత్రుల ముందే శ్రీనివాస్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసిన ఘటన కలకలం రేపింది. ఇది అన్యాయం అంటూ పోలీసులు, రెవెన్యూ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు డిపో మేనేజర్. విషయం తెలిసి వెంటనే ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. వారి ఆదేశాలతో తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు శ్రీనివాసరెడ్డి. అక్కడితో వివాదం సమసిపోయిందని అనుకున్నారంతా. కానీ…..
అధికారం.. ఆ అధికారిపై కక్ష కట్టింది. శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకుంటూ సెంట్రల్ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో చీరాల ఆర్టీసీ డిపో మేనేజర్ని బాపట్ల డిపో ఇన్ఛార్జ్గా నియమించారు. ప్రభుత్వం, అధికారపార్టీ ఒత్తిడితోనే శ్రీనివాస్రెడ్డిపై చర్యలు తీసుకున్నట్టు మండిపడుతున్నారు మిగతా ఉద్యోగులు.