KTR: అసెంబ్లీ ఎన్నికలంటే అందరి అటెన్షన్ ఉంటుంది. కానీ, ఓ జిల్లాలో ఓ చిన్న ఎలక్షన్ మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హీట్ పుట్టిస్తోంది. సిరిసిల్ల జిల్లాలో ఏడేళ్ల తర్వాత సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) ఎన్నికలు జరుగుతున్నాయి. మెజార్టీ ఓటర్లు రైతులే. అందులోనూ సిరిసిల్ల. సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బకొడితే.. ఆ షాక్ తెలంగాణ వైజ్ గా తగులుతుందని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. సొంత ఇలాఖా కావడంతో మంత్రి కేటీఆర్ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోరు హోరాహోరీగా జరగనుందని తేలిపోయింది. సత్తా చాటేందుకు కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. బీజేపీ.. బీఆర్ఎస్ ను ఎలాగైనా ఓడించాలనే కసితో ఉంది. అందుకే, సిరిసిల్ల సెస్ ఎన్నికలపై అందరి నజర్.
సెస్ ఎలక్షన్స్ ఉన్నాయనే ప్రభుత్వం సిరిసిల్ల రైతులకు ముందుగానే రైతు బంధు వేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. వేరే జిల్లాల్లో ఎవరికీ రైతు బంధు వేయలేదు కానీ, సెస్ ఎలక్షన్స్ ఉన్నాయని సిరిసిల్ల రైతుల ఖాతాలో డబ్బులు వేయడం.. వారిని ప్రలోభపెట్టడమేనని మండిపడుతున్నాయి.
202 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 252 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. మొత్తం 87,130 మంది ఓటర్. శనివారం ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 5.00 వరకు పోలింగ్. మండల ఇన్చార్జీలుగా ఎంపీడీవోలు, తహశీల్దార్లను నియమించారు. ఒక్కో తహశీల్దార్ లేదా ఎంపీడీవోలకు పదేసి చొప్పున ఎన్నికల పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత ఇచ్చారు.
ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మంగా తీసుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ను విధించారు. ఎక్కువ ఓటర్లు ఉన్నచోట, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలలో అదనపు ఫోర్స్ను మోహరించారు. మొత్తం 1100 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉన్నారు.