Funds Released to flood affected states including AP, Telangana: దేశ వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నిధులను విడుదల చేసింది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాలకు కూడా నిధులను మంజూరు చేసింది. అయితే, తెలంగాణ విషయంలో వివక్షతను చూపించింది. ఏపీకి అధిక నిధులు కేటాయించి, తెలంగాణకు తక్కువగా నిధులు కేటాయించింది. దీంతో కేంద్రంపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఆపద సమయంలో సాయం చేయడంలో కేంద్రం ఈ విధంగా వివక్ష చూపడమేంటంటూ విమర్శిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే వరదలు సంభవించాయో ఆయా రాష్ట్రాలకు కేంద్రం మంగళవారం నిధులను విడుదల చేసింది. మొత్తం రూ. 5,858.60 కోట్ల నిధులను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ – ఎస్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ – ఎన్డీఆర్ఎఫ్ నుంచి మొత్తం 14 రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఈ నిధులను మంజూరు చేసింది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. తెలంగాణకు రూ. 416.80 కోట్లు, ఆంధ్రప్రదేశ్ కు రూ. 1,036 కోట్లను మంజూరు చేసింది. అయితే, ఈ 14 రాష్ట్రాల్లో మహారాష్ట్రకు అత్యధికంగా రూ. 1,492 కోట్లను విడుదల చేసింది. ఆయా రాష్ట్రాలకు ఈ నిధులను తక్షణ సాయంగా కేటాయించింది. కేంద్ర బృందాల నుంచి పూర్తి స్థాయి నివేదిక అందిన తరువాత మరికొన్ని నిధులను మంజూరు చేయనున్నట్లు ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
Also Read: రైలు ప్రయాణికులారా బిగ్ అలర్ట్.. రూల్స్ మారాయ్.. తెలుసుకోకుంటే చిక్కులే
ఇదిలా ఉంటే.. ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు, వరదలు అల్లకల్లోలం సృష్టించాయి. దీంతో తెలంగాణ, ఏపీ ఆర్తనాదాలు చేశాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు పూర్తిగా ముంచెత్తడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. భారీగా పంటనష్టం వాటిల్లింది. పశువులు, ఇతర వస్తువులు, ఇండ్లు, వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఆ సమయంలో ఎక్కడ చూసినా కూడా ఇండ్లు పూర్తిగా వరదతో నిండి కనిపించాయి. వరుసగా మూడు నాలుగు రోజులు వరదలు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. దీంతో ప్రాణనష్టం ఎక్కువగా వాటిల్లకుండా తగ్గించగలిగారు.
ఏపీలోని విజయవాడలో వరదలు భారీగా పొంగిపొర్లాయి. బుడమేరు వరద మొత్తం విజయవాడనే ముంచెత్తింది. దీంతో ఆ సమయంలో నగరం మొత్తం వరద నీటిలో తేలియాడింది. ఎటు చూసినా వరద నీరే కనిపించింది. ప్రజలు సర్వం కోల్పోయి ఆర్తనాదాలు చేశారు. పలువురు మృత్యువాతపడ్డారు. కొంతమంది వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. సుమారుగా పది రోజులపాటు వరద నీటిలో ఉండాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టి వారికి సహాయం అందించింది.
ఈ విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పర్యటించారు. ఎక్కడెక్కడైతే వరదలు బీభత్సం సృష్టించాయో అక్కడక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించారు. వరద బాధితులను కూడా ఆయన పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. రైతులతో కూడా కేంద్ర మంత్రి మాట్లాడారు. అధైర్యపడొద్దు కేంద్రం సాయం చేస్తుందంటూ వారికి భరోసా ఇచ్చారు. శివరాజ్ సింగ్ కు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వర్షాల, వరదల వివరాలు.. వాటి వల్ల కలిగిన నష్టాన్ని వివరించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకు భారీగా వరద సాయం అందేలా కృషి చేస్తానంటూ ఆయన హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Also Read: హర్యానాలో హస్తం మెరుస్తుందా..? కమలం వికసిస్తుందా?
అయితే, కేంద్ర వరద సాయానికి సంబంధించిన నిధులను మంజూరు చేయడం ప్రశంసనీయమే కానీ, తమ రాష్ట్రంపై వివక్ష చూపిందంటూ తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఏపీకి కేటాయించిన నిధుల్లో కనీసం సగం కూడా కేటాయించలేదని, కేంద్రంలో, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఉన్న కారణంగానే ఏపీకి అధిక నిధులను కేటాయించి వివక్ష చూపిస్తున్నదంటూ వారు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా కేంద్రం తమ తీరును మార్చుకుని తెలంగాణకు మరికొన్ని నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.