Eight killed, three injured in separate road accidents in Telangana: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వేరువేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తమోడాయి. ఈ ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి సమీపంలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. అలాగే ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
కారులో ప్రయాణిస్తున్న వారంతా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో మొయిజ్(60), ఖాజా మొయినుద్దీన్(40), మహ్మద్ ఉస్మానుద్దీన్(10), ఫరీద్(12), బాబు అలీ(8)గా గుర్తించారు. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించారు.
మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. సోమవారం భైంసాలో ఓ కార్యక్రమానికి అందరూ హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా.. మేకలగండి సమీపంలో మాక్స్ పికప్ వాహనం సైడ్ పిల్లర్లను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అలాగే మరో ఘటనలో ముగ్గురు మృతి చెందారు. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. కొత్త కారు కొనడానికి బైక్పై వెళ్తున్న ముగ్గురిని లారీ రూపంలో బలి తీసుకుంది. మృతులు త్రిపురారాం మండలం గుంటిపల్లి అన్నారం గ్రామానికి చెందిన మల్లికంటి దినేశ్(22), వేములపల్లి మండలం మొలకపట్నం గ్రామానికి చెందిన వలదాసు వంశీ(22), మాడ్గులపల్లి మండలం ఆగమోత్కూర్ గ్రామానికి చెందిన అభిరాళ్ల శ్రీకాంత్(21)గా గుర్తించారు.
Also Read: సిగ్గు లేకుండా మాట్లాడకు : మహేశ్ కుమార్ గౌడ్
కొత్త కారు కొనేందుకు దినేశ్ వెళ్తుండగా.. స్నేహితులు వంశీ, శ్రీకాంత్లను సమాచారం ఇచ్చాడు. దీంతో అందరూ కలిసి ఒకే బైక్ పై సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి వెళ్లి కొంత డబ్బు చెల్లించారు. అనంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా.. చిలుకూరు మండలంలో మిట్స్ కాలేజీ వద్ద బైక్ ను లారీ ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.