– స్కాముల్లో ఘనాపాటి.. బూదాటి
– 3,500 మందికి నైస్గా ప్రీలాంచ్ టోపీ
– రూ.15 వందల కోట్ల దాకా దోపిడీ
– ఎట్టకేలకు ఈడీ చేతికి సాహితీ లక్ష్మినారాయణ
– 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్
– గతంలో అరెస్ట్ అయి బెయిల్పై బయటకు
– ఇక పర్మినెంట్గా లోపలేనా?
– బ్యాంక్ అకౌంట్లతో బయటపడ్డ అసలు నిజాలేంటి?
– సాహితీ సొమ్ము ఎవరెవరికి చేరింది?
– తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు స్కాములో భాగస్వాములెవరు?
– బూదాటి లక్ష్మినారాయణ చిట్టా.. స్వేచ్ఛ ఎక్స్క్లూజివ్
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: కేసీఆర్ ఏలుబడిలో జరిగిన స్కాముల్లో సాహితీ చాలా ప్రత్యేకం. సామాన్యుడి సొంతింటి కలను ఆసరాగా చేసుకుని సాగిన ఈ దందాలో బీఆర్ఎస్ పెద్దలకు కూడా లింక్స్ ఉన్నాయన్న అనుమానాలున్నాయి. బినామీ డైరెక్టర్స్ను రంగంలోకి దింపి గులాబీ నేతలు చక్రం తిప్పినట్టు ఆరోపణలున్నాయి. దాదాపు 3,500 మందిని బురిడీ కొట్టించి రూ.15 వందల కోట్ల రూపాయలు దోచేశాడు సాహితీ సంస్థ ఓనర్ బూదాటి లక్ష్మినారాయణ. కొంత సొమ్మును సొంతానికి ఇష్టారీతిన వాడుకున్నాడు. ఇంకొంత సొమ్ము కమీషన్లు, లాలూచీలు, పార్టీలు అంటూ తగలేశాడు. తాజాగా బూదాటిని ఈడీ అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో దోపిడీ సొమ్మంతా ఎక్కడకు చేరిందో ‘స్వేచ్ఛ’ ఎక్స్క్లూజివ్గా జనం ముందు ఉంచుతోంది.
Also Read: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. కొట్టుకున్న కార్యకర్తలు?
ఈడీ విచారణ.. 14 రోజుల రిమాండ్
సాహితీ ఇన్ఫ్రా కేసులో లక్ష్మినారాయణను ఈడీ అదుపులోకి తీసుకుంది. వైద్య పరీక్షలు నిర్వహించి తమ కార్యాలయానికి పట్టుకెళ్లింది. తర్వాత 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీంతో చంచల్ గూడ జైలుకు తరలించారు అధికారులు. కేసు దర్యాప్తులో భాగంగా 14 రోజుల కస్టడీ ఇవ్వాలని ఈడీ పిటిషన్ వేసింది. కౌంటర్ ధాఖలు చేయాలని నిందితుడు లక్ష్మినారాయణను ఆదేశించింది న్యాయస్థానం. తన రిమాండ్ రిజెక్ట్ చేయాలని సాహితీ ఎండీ లక్ష్మినారాయణ న్యాయవాదులు వాదించారు. ఈడీ న్యాయవాది అధికారులకు అతను సహకరించడం లేదన్నారు. గతంలోనే సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారని, మళ్ళీ అదే కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు లక్ష్మినారాయణ లాయర్లు. ఇరు వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు.
సాహితీ పేరుతో దోపిడీ
దాదాపు రూ.15 వందల కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తివేశాడు బూదాటి. ఇప్పటివరకు 50కి పైగా కేసులు నమోదయ్యాయి.
సాహితీ సితార – రూ.135 కోట్లు
సిస్టా అడోబ్ – రూ.79 కోట్లు
సాహితీ స్వాద్ – రూ.65 కోట్లు
ఆనంద ఫార్చూన్ – రూ.45 కోట్లు
సాహితీ మెహ – రూ.44 కోట్లు
సాహితీ గ్రీన్ – రూ.40 కోట్లు
సాహితీ సుదిక్ష – రూ.22 కోట్లు
సాహితీ కృతి – రూ.16 కోట్లు
సాహితీ రూబికాన్ – రూ.7 కోట్లు
భూములు లేకున్నా ప్రీలాంచ్ పేరుతో మాయం
2022లో సాహితీ ఇన్ఫ్రాపై సీసీఎస్కు బాధితులు క్యూకట్టారు. దీంతో బూదాటిపై పోలీసులు, మీడియా ఫోకస్ పెడితే లెక్కలేనన్ని వ్యవహారాలు బయటకొచ్చాయి. భూములు లేకున్నా, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి, అందమైన బ్రోచర్లు చూపించి ప్రీలాంచ్ పేరుతో డబ్బులు వసూలు చేశాడు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ వెలుగు వెలిగిన బూదాటి కథంతా రివర్స్ కావడానికి అమీన్పూర్ వెంచర్ కారణం. 2019 జూన్లో ప్రీలాంచ్ పేరుతో అమ్మకాలు చేశాడు. దాదాపు 17 వందల మంది నుంచి రూ.430 కోట్ల దాకా రాబట్టాడు. 2023లోగా ఇళ్లు ఇస్తాననేది ఒప్పందం. కానీ, బూదాటి నిర్మాణాలు చేసింది లేదు. అయితే, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఆ సొమ్మంతా ఎక్కడికి పోయింది. ఎలా వాడాడు.
Also Read: మోసాలకు బ్రాండ్ అంబాసిడర్.. ఒకే స్థలం నలుగురికి.. సాహితీ హిస్టరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
పక్కదారి పట్టిన ప్రీలాంచ్ సొమ్ము
సాహితీ స్కాములో దాదాపు రూ.13 వందల కోట్ల దాకా బ్యాంక్ స్టేట్మెంట్లలో లింకులు ఉన్నాయి. లక్ష్మినారాయణ భార్య, పిల్లల అకౌంట్లకు కొంత సొమ్ము ట్రాన్స్ఫర్ అయింది. ఆంటోనీ రెడ్డి ద్వారా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్సీకి రూ.20 కోట్లు ముట్టినట్టు లెక్క ఉంది. అలాగే, సంధ్య శ్రీధర్ రావుకు రూ.45 కోట్లు అందాయి. ఫినిక్స్ సంస్థకు రూ.80 కోట్ల దాకా వైట్లోనే ట్రాన్స్ఫర్స్ జరిగాయి. ఇక, గ్రీన్ మెట్రో అశోక్కి రూ.15 కోట్లు, శ్రీనిధి శ్రీధర్కు రూ.15 కోట్లు, షిబా ఇన్ఫ్రా టెక్కు రూ.8 కోట్లు ఇలా చాలా సొమ్ము దారి మళ్లింది. అలాగే, తనకు సంబంధించిన కంపెనీల అకౌంట్లకు కూడా మళ్లించాడు లక్ష్మినారాయణ. ఈ లెక్కలన్నీ బ్యాంక్ అకౌంట్లలో క్లియర్గా ఉన్నాయి. ఇవి కేవలం అఫీషియల్గా జరిగిన ట్రాన్స్ఫర్స్ మాత్రమే. తెర వెనుక ఇచ్చిపుచ్చుకున్నది ఎంతో ఉంది. వీటికితోడు, బూదాటి సొంతానికి వాడుకున్న సొమ్ము రూ.67 కోట్లకు పైనే ఉంటుంది. ఇక క్యాష్ రూపంలో అయితే, రూ.50 కోట్ల దాకా వాడేసుకున్నాడు. ల్యాండ్ అడ్వాన్సుల రూపంలో రూ.104 కోట్ల దాకా తరలించాడు. వీటిలో ఫినిక్స్, ఒమిక్స్ సంస్థలకే డబ్బు అధికంగా చేరింది. వీటితోపాటు లోన్స్, ఇతర అడ్వాన్సుల రూపంలో రూ.129 కోట్ల దాకా సైడ్ అయింది. ఇప్పుడు ఈడీ లెక్కల తీగలు లాగితే, డొక్కంతా కదిలే ఛాన్స్ ఉంది. పర్మినెంట్గా బూదాటి కటకటాల్లో ఉండే అవకాశం ఉంది.
బాధితులకు న్యాయం జరిగేనా?
సాహితీ ఇన్ఫ్రా పేరుతో లక్ష్మీనారాయణ రూ.15వందల కోట్ల వరకు మోసం చేశాడు. ఆ సొమ్మంతా ప్రజలదే. ప్రీలాంచ్ పేరుతో దోచేశాడు. దీనిపై బాధితులు సీసీఎస్, రెరాలో కొట్లాడారు. ఇప్పుడు ఈడీ అదుపులోకి తీసుకోవడంతో, దర్యాప్తు సంస్థలు కేవలం అరెస్టు చేసి రిమాండ్ చేయడం కాకుండా బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. సాహితీ ఆస్తులను అటాచ్ చేసి బాధితులకు డబ్బు తిరిగి చేరేలా చూడాలని కోరుతున్నారు వారి తరపు న్యాయవాది పోతిరెడ్డి కృష్ణకాంత్. బినామీ ఆస్తులపైన ఈడీ, సీసీఎస్ దృష్టి పెట్టి విచారణ జరపాలని, సాహితీ డబ్బులు వివిధ కన్స్ట్రక్షన్ కంపెనీలకు బదిలీ అయ్యాయని తెలిపారు. వాళ్లను కూడా గుర్తించి విచారణ జరపాలని, అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందని కోరుతున్నారు.