Work Pressure: పని ఒత్తిడి మనిషిని మానసికంగా కుంగదీస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇటీవల పని ఒత్తిడితో సంభవించే మరణాలు కూడా అధికమయ్యాయని చెప్పవచ్చు. ఆహారం లేదు.. నిద్ర లేదు.. విశ్రాంతి లేదు.. కానీ మానసిక ఆందోళన మాత్రం ఉందనేలా పలు ఉద్యోగాలు ఉన్నాయని ప్రవేట్ జాబ్స్ లలో రాణిస్తున్న ఉద్యోగులు బాహాటంగానే చెబుతున్నారు. టార్గెట్స్ అంటూ ప్రకటించడం, అవి పూర్తి చేయకుంటే జీతాలలో కోత విధించడం కూడా ఉద్యోగుల ఒత్తిడికి మరో కారణంగా చెప్పవచ్చు. దీనితో నిద్రాహారాలు లేకుండా పలు సంస్థల్లో పని చేసే ఉద్యోగులు బ్రతుకు జీవుడా అంటూ అలాగే కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా ఓ ఉద్యోగి 45 రోజులు నిద్ర పోకుండా పని చేసి, ఆ ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు వదిలారు. అతడు రాసిన సూసైడ్ నోట్ లో ఈ విషయం రాయగా.. అతని మరణానికి గల అసలు కారణం బయట పడింది.
ఉత్తరప్రదేశ్ లోని ఓ ఫైనాన్స్ సంస్థలో ఘాన్సీకి చెందిన తరుణ్ సక్సేనా పని చేసేవారు. అయితే 42 ఏళ్ల వయస్సు గల ఈయన ఏరియా మేనేజర్ గా పని చేస్తున్నారు. ఈయనపై అదే కంపెనీ పై స్థాయి ఉద్యోగులు తీవ్ర ఒత్తిడి చేసేవారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు గల సాక్ష్యమే తరుణ్ సక్సేనా సూసైడ్ నోట్. కాగా తరుణ్ తన సమీపంలో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడగా.. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, మృతుడి వద్ద దొరికిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్ చూసిన పోలీసులు సైతం అందులో గల మ్యాటర్ చూసి షాక్ కు గురయ్యారు.
Also Read: Ratan Tata: నిర్మాతగా మారిన రతన్ టాటా.. ఆయన ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా గురించి మీకు తెలుసా?
ఇంతకు ఆ సూసైడ్ నోట్ లో ఏముందంటే.. తాను పని ఒత్తిడికి లోనై 45 రోజులు నిద్రపోలేదని, తనకు టార్గెట్ లో కేటాయించి పై స్థాయి అధికారులు ఇబ్బందులు పెట్టినట్లు తరుణ్ రాశారు. అంతేకాదు టార్గెట్ పూర్తి చేయకుంటే.. జీతంలో కోత ఖాయమంటూ తనను బెదిరించేవారని, ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ లో ఉంది. అలాగే తనను కింది స్థాయి ఉద్యోగుల ముందు అవమానించేవారని, ఇలా ఒత్తిడితో 45 రోజులు నిద్రలేదని, ఏమి చేయాలో తోచక తాను ప్రాణాలు తీసుకుంటున్నట్లు తరుణ్ తన ఆవేదన సూసైడ్ నోట్ రూపంలో వెళ్లగక్కారు. అయితే సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అసలు విషయాన్ని వెలికి తీసేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇటీవల మహారాష్ట్రలో సైతం ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. అంటే దీనిని బట్టి ఒత్తిడి మానసిక స్థైర్యాన్ని కోల్పోయేలా చేయడమే కాక, ఆత్మహత్యలకు దారితీస్తుందని చెప్పవచ్చు. ఆత్మహత్యకు పాల్పడే ముందు మనల్నే నమ్ముకున్న కుటుంబాల గురించి ఆలోచించాలి కానీ.. ఆత్మహత్య ఒక పిరికిపంద చర్యగా పలువురు తెలుపుతున్నారు. ఏదిఏమైనా పని ఒత్తిడి ఒక ప్రాణాన్ని అయితే తీసిందిగా… !